Monday, June 15, 2020

జయవిజయులకు సనకసనందనాదుల శాపము

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ 

మనకి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటినుంచి ఈ రోజు వరకు మనకి శ్రీమద్ భాగవతం , విష్ణు కధలు మొ.. మనకి గురువు గారు ఆన్లైన్ లో చెప్పడం అందరికీ తెలిసిన సంగతే.. ఎక్కడ ఉన్న 7. 20 నిముషాలు కు ఇంటికి వచ్చి ఆన్లైన్ లో గురువు గారు కి శ్రీ కృష్ణ శరణం మమ అని గురువు గారు మొదలు పెడతారు.. ఇక అమృత ధార , గంగా  ప్రవాహం లా వెళుతూ ఉంటుంది..

తింటే గారెలే తినాలి ! వింటే భారతం వినాలి ! ఉంటే వనంలో ఉండాలి ! అంటే అమృతం చిందాలి! కొంటే ఐఫోన్  యే కొనాలి!
కంటే అసలు సిసలు ఆడపిల్లనే కనాలి!!!  అనే నానుడి.. అలాగే వింటే మా పూజ్య గురువు గారు ప్రవచనం వినాలి.. 

పిల్లలకి పెద్దలకి అందరికీ అర్ధమయ్యే సరళ మైన భావం తో భాష తో మాకు తెలియచేస్తారు.. 

మా శివ పరివారంచేసుకునే అదృష్టం 



ఇక శ్రీ మద్  భాగవతం లో ప్రస్తావించుకుందాం.. మొన్నటివరకు గురువు గారు జయవిజయులకు సనకసనందనాదుల శాపము. గురించి చెప్పారు. ఎదుకంటే భాగవతం ఒక్కసారి చదివినప్పుడు విన్నప్పుడు బాగుంటుంది.. ఇంకో సారి మననం చేసుకుందుకు ఇలా వ్రాసుకుంటున్నాము 

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనము  అవుతుంది. జయవిజయులు ఏడవద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు.  సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరము  భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపము  ఉన్నవారు. వారు ఏడవద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

 సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకునేందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావము ఉన్నవాడు.  ఆయన  లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయనను దర్శనము చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడము మీకు మించిన స్వాతంత్ర్యము.  ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడము  మొదలు పెట్టారు.  అది ఎక్కడ పుష్కలముగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

 శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరము మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములోకి మకరందము కోసము గండుతుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

 శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగితే  – ‘స్వామీ మేము తప్పే చేశామో! ఒప్పే చేశామో! మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవద్వారం దగ్గర ఈ పార్షదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు, వారు మాయందు విముఖులయి ఉన్న వారిని భూలోకమునందు జన్మించమని శపించాము.  నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధము అంటే మన్నించవలసినది’  అన్నారు.

 శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు.  ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను. నిత్యాపాయినియై నిరంతరము లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడములో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అని ఎంతో పెద్దమాట అన్నాడు ! ఆ చేయి లోకములనన్నిటిని రక్షించే చేయి.  మీరు నిరంతరము  నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మ అంతటివారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము నందు భక్తితో నిలబడిన మిమ్ములను జ్జయ విజయులు అడ్డుపెట్టి మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద ఉండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలని అంతరము తెలుసుకొని ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుడిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకుని  వస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. నాకు దుష్ట పేరు తెచ్చారు. వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’

వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోనియందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

 జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ‘స్వామీ! లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడములో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు.  స్వామి ‘మీరు మూడుజన్మలు  గొప్ప రాక్షసులు అవుతారు.  మిమ్మల్ని  దునుమాడవలసిన అవసరం కూడా నాదే.  నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా స్వామి వారి రక్షణ కనబడుతోంది..

మిగతాది తరువాతి పోస్ట్ లో వస్తుంది..  యజ్ఞ వరాహ మూర్తి ఆవిర్భావం..

ఇట్లు
శివ పరివారం 

No comments:

Post a Comment