04. యజ్ఞ వరాహ మూర్తి
వారిలో ఒకడయిన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రము అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. వరుణుడు– ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణముగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినా ఏదయినా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాపము దగ్ధమయిపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం? అనుకుని స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఆయననను స్తోత్రం చేయాలి. ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.
యజ్ఞవరాహం సముద్రములోకి ప్రవేశించి తన నాసికతో, మూపుతో సముద్ర అడుగు భాగమును కెలకడము ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.
విసిరినప్పుడు జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయననుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహముగా వచ్చి నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.
No comments:
Post a Comment