Monday, July 6, 2020

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం- శ్రీమద్ భాగవతం లో కథలు


ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ 

గురువు గారు మనకి భాగవత ప్రవచనం లో అగస్యులు మహా ముని గురించి చెబుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం  అని ఎలా వచ్చిందో తెలియచేసారు 

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..! ఇది చాలా మంది వినే ఉంటారు . .

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’: అని మన ఇళ్ళల్లో పిల్లలకు గనుక కడుపులో నొప్పి వస్తోంటే, వారి పొట్టపై అరచేతితో రాస్తూ, "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అంటూ మంత్రం అనడం మనకు అలవాటు.

ఆహారం జీర్ణం కానట్లు అనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలా స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకీ ''జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..'' అనే నానుడి ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ, సుతీష్ణుడు అనే ఋషి ద్వారా, అగస్త్యుడు ఉండే ఆశ్రమం జాడ తెలుసుకుంటాడు..

సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుకుతూ వెళుతుంటే వారికి ఒక పెద్ద బూడిద రాశి, ఎముకల గుట్ట కనిపిస్తాయి. అప్పుడు రాముడు..సీతా లక్ష్మణులతో గతంలో ఆక్కడ జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు.

ఇప్పుడు దాని కధ తెలుసుకుందాము

ఇల్వలుడు, వాతాపి అను ఇద్దరు రాక్షసులుండేవారు. వారిద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని దారిన పోయే పండితులను, వేదాధ్యయన పరులను భోజనానికి పిలిచేవారు. అతిథి పూజ చేస్తేగాని మేము భోజనం చేయమనే నిబంధన మాకు పెట్టుకున్నాము. రండి రండి అని పిలిచేవాళ్లు. వీళ్లు చెప్పేది నిజమనుకొని బాటసారులు భోజనానికి వచ్చేవారు. (అపుడు అంతా నడుచుకొంటూ వెళ్లేవారుకదా ) అలా వచ్చిన వారికి వాతాపిని ఇల్వలుడు ఆహార పదార్థంగా తయారు చేసి వారికి వడ్డించేవారట. వారు తిని భుక్తాయాసం తీర్చుకోవడానికి కాసేపు అరుగు పైన కూర్చునేసరికి ‘వాతాపి, వాతాపి! ఇలా బయటకు రా’ అని ఇల్వలుడు పిలిచేవాడట. వాతాపి ఆ తిన్నవారి కడుపు చీల్చుకుని బయటకు వచ్చేశేవాడట. దాంతో ఆహారం తిన్నవారు చనిపోయేవారు.

ఇక ఏముంది ? హాయిగా ఇద్దరూ ఆ మనిషిని తినేసేవారట. ఇట్లా వీరి ఆగడాలు మరీ శ్రుతిమించి పోయాయి. బాటసారులు అటు వెళ్లాలంటే భయపడిపోయేవారట. దాంతో వారంతా వచ్చి అగస్త్యునికి తమ బాధను చెప్పుకున్నారు. ఆయన కూడా వాతాపి, ఇల్వలుల దగ్గరకు వెళ్లాడు. ఆ మహర్షిని వీరు భోజనానికి పిలిచారు. భోజనం పెట్టారు.
కాని అగస్త్యుడు భోజనం తినగానే తన పొట్టను తడుముకొంటూ జీర్ణం జీర్ణం వాతాపి అన్నాడట. అంతే అక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు.

ఇల్వలుడు ఎప్పటిలాగే ‘వాతాపి బయటకు రా’అని పిలిచాడట. మహర్షి ‘ఇల్వలా! ఇంకెక్కడ వాతాపి వాడు నా పొట్టలో జీర్ణమైపోయాడు..ఇక నీవంతు’అన్నాడట. దాంతో వీనికి బుద్ధి వచ్చింది. మహర్షి కాళ్లావేళ్లా పడ్డాడు.

అదిగో అప్పట్నుంచే మన పెద్దలు చిన్న చిన్న పిల్లలకు ఉగ్గు పెట్టినప్పటినుంచి ఏం పెట్టినా వారు తిన్నవెంటనే ఇలా అంటారు.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుఱ్ఱాల్ తిన్న గుగ్గిళ్లరిగి
ఏనుగుల్ తిన్న వెలక్కాయలరికిగి
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి
భీముడు త్ని పిండి వంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ రుూ బిడ్డను సంజీవ రాయా! అనేవారు. 

చూశారా వాతాపి జీర్ణం వెనుక ఎంత కథ ఉందో ...

ఇట్లు 
శివపరివారం 

1 comment:

  1. Sarma : Iam reading your blog posts on regular basis. Presenting the details very well. God Bless you brother!!

    ReplyDelete