Monday, July 13, 2020

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు భాగవతం లో గురువు గారు చెట్లు మొక్కలు వాటి వివరణ చెప్పారు

పచ్చదనం, పరిశుభ్రం అంటూ మొక్కలు పెంచడం గురించి, వృక్షాల వల్ల ఉపయోగాల గురించి ఇటీవలికాలంలో ఊదరగొట్టేస్తున్నారు. కానీ, వృక్షాల గొప్పదనం గురించి బమ్మెర పోతన గారు  ఏనాడో భాగవతంలోనే చెప్పారు. బృందావనంలో గోపకులు గోవుల్ని మేపుతూ అలసిపోయి దట్టంగా ఉన్న చెట్ల నీడలకు చేరతారు. ఆ సందర్భంలో వారు బలరామకృష్ణులనుద్దేశించి చెప్పిన పద్యమిది..

‘‘అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు, నా
తప శీతానిల వర్ష వారకములై, త్వగ్గంధ నిర్యా సభ
స్మపలా శాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణి చే
నుపకారంబులు సేయునెల్లరకు నీ యుర్వీజముల్‌ గంటిరే?’’

ఈ చెట్లకున్న 16 సుగుణాల గురించి చెప్పే పద్యమిది. అవేంటంటే.. చెట్లు ఎవరికీ అపకారం చేయవట. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేయకుంటే అదే పదివేలు. ఈ యుగానికి ఇదే గొప్ప లక్షణం. చెట్లు ఏకాంతంగా ఉండగలుగుతాయట. ఏకాంతంగా ఉండగలిగినప్పుడే మనం ఎవ్వరమో ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఇవి మనుషులకు ఆదర్శం. అలాగే.. చెట్లు ఎండ నుంచి, చలిగాలి నుంచి రక్షిస్తాయి. మర్రిచెట్టు వంటివాటి నీడలు ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయని శాస్త్రం. వర్షంలో తడిసిపోకుండా దట్టమైన చెట్లు కాపాడతాయి. చెట్లపై తోలు వస్త్రాలకు, తాళ్లకు వాడతారు (త్వక్‌). వాటి సుగంధం గాలిని ఆరోగ్యకరంగా చేస్తుంది (గంధ). వాటి జిగురు కూడా ఉపయోగపడుతుంది (నిర్యాస).

వాటి బూడిదను వైద్యంలో ఉపయోగిస్తారు (భస్మ). వాటి ఆకుల పచ్చదనంతో పర్యావరణం మొత్తం ప్రాణవాయుమయం అవుతుంది(పలాశ). వాటి చిగుళ్లు కూరల్లో, పచ్చళ్లలో వాడతారు (అగ్ర). పూలలో ఉండే తేనె ఉపయోగం మందుల్లో ఎంతో ఉంది (మరంద). వాటి వేళ్లు ఆహారంగా, వైద్యంలో ఉపయోగపడతాయి(మూల). పూలు పూజకు ప్రశస్తం, శిరోధార్యం (కుసుమ). వాటి నీడ తాపోపశమనం (ఛాయా). వాటి ఫలాలు పుష్టికరమైన ఆహారం (ఫలశ్రేణి). ఇలా 16 ఉపయోగాలను ఒకే పద్యంలో నాలుగు పంక్తుల్లో పోతన తెలియజేశాడు. ఇంత చక్కని పద్యాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టకపోవడం వల్ల ఎంత కోల్పోతున్నాం?
ఇలాంటి పద్యాలూ కనీసం ఉద్యాన వనం లో పెట్టి వాటి వివరణ పెడితే బాగుంటుందని మా శివ పరివారం అభిప్రాయం

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనకి శాస్త్రం తెలియచేస్తోంది 

మన చుట్టూ ఉంటూ వాటి ఉనికి తో మనకి అన్నివిధాల మేలు చేస్తున్న వృక్షాలు చాలానే ఉన్నాయి. పరిసరాల శుద్ది కోసం, వాతావరణ నైర్మల్యం కోసం, ప్రాణ వాయు సంచారం వల్ల అనేక జీవ కోటి బ్రతకడం కోసం వృక్షాలు చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఫల పుష్పాలతో కూడిన చెట్లతో, కంటికి ఇంపుగా ఆహ్లాదం గా వనాలు ఉన్న చోట దేవతలుఉంటారు, ఇటువంటి ప్రదేశాలు వారికి ప్రీతికరమై కొలువుతీరుతారు. దైవ సంబంధితమైన వృక్షాలను కాపాడుతూ, వాటి ని పూజించడం ద్వారా ఎంతో మేలు జరగడమే కాకుండా, గ్రహాల వలన కలిగే దోషాలు కూడా నివారింపబడతాయి.

అగ్ని హోత్రం నిర్వహించడం కంటే, పుత్రుడిని కనడం కంటే, బాటలో నీడనిచ్చు మహా వృక్షాలను నాటడం పుణ్యకరమని భావిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. చెట్లు ఇహలోకం లో పరలోకం లో సుఖానిచ్చే సత్పుత్రుల తో సమానమని, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయమై రాబోవు పితృదేవతలను తృప్తి  పరుస్తాయని చెప్పబడింది.

చెట్లకు బాధను కలిగిస్తే, అంటే నరకడం, కొట్టడం చేస్తే మహాపాపమని, ముఖ్యం గా మర్రి, రావి, చందనం చెట్లను నరికితే బ్రహ్మహత్య తో సమానమని, మూలాన్ని నరికివేస్తే వంశక్షయమని, చెట్లను కొట్టినవాడు రాబోవు జన్మలో మూగవాడుగా, అనేక శారీరిక, మానసిక రోగగ్రస్తుడిగా పుడతాడని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.

నదీ తీరాల్లో వృక్షాలను నాటడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుందని పద్మపురాణ వచనం. ప్రతి పర్వం లో వాటి ఆకులు పడితే అవి పిత్రుదేవతలకు పిండాలని సృష్టి ఖండం ద్వారా తెలుస్తుంది.

మార్గాల గుండా, దేవాలయాల్లో ను చెట్లను నాటడం వలన కీర్తి లభిస్తుందని చెప్పబడింది.

మఱ్ఱిచెట్టు శివరూపతత్వం అని స్కాందపురాణం ద్వారా తెలుస్తుంది.

తులసి మొక్క సర్వపాపహరమనీ దీనితో సాటి వచ్చునది ఏది లేకపోవడం వలన దీని పేరు సార్ధకమని, పాపాలకు అగ్నిశిఖ వంటిదని ముక్తిని ప్రసాదిన్చేదని, శ్రీ మహావిష్ణువు భక్తీ నోసంగునదని దేవి భాగవతం లో తులసి యొక్క పవిత్రతను చెప్పబడింది. తులసి మొక్కకి ఎన్నో ఆరోగ్య గుణాలు, దైవిక గుణాలు ఉన్నాయి. ఇంట్లో ఉత్తరం వైపు తులసి చెట్లని ఉంచడం వలన వాస్తురీత్యా ఎంతో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.

బిల్వ వృక్షం గురించి ఋగ్వేద, యజుర్వేదాలలో ప్రస్తావన చేయబడింది. శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షం. ఈ చెట్టు కి 365 రోజులు పండ్లు ఉంటాయి. ఈ పండ్లని లక్ష్మి ఫలమని లేక శ్రీ ఫలమని అంటారు.

రావి చెట్టు ప్రకృతి లోని పావన వృక్షాలలో ఒకటైనది. పురాణాలలో రావి చెట్టు యొక్క విశిష్టత గురించి అనేక విధములుగా ప్రస్తావించ బడింది. రావి చెట్టుని విష్ణు స్వరూపం గా పూజిస్తారు. అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది మూర్తి దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీనిని పుణ్య మూలమని సేవిస్తారు. దీనిని ఆశ్రయించడం వలన అభీష్ట సిద్ది కలగడమే గాక, పాప నాశనం కలుగుతుంది.

వాతావరణ కాలుష్యం, రోగకారక కీటకాలను నాశనం చేసే వృక్షం కనుక దీనిని దేవతా వృక్షం గా భావిస్తారు. ధార్మిక విశ్వాసం  గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మ హత్య తో సమానం అని భావిస్తారు. వైజ్ఞానిక పరం గా రావిచెట్టు నిరంతర ప్రాణ వాయువుని వెలువరించే ఏకైక అధ్బుత వృక్షం. దీని సమీపం లో ఉండటం వల్ల ప్రాణ శక్తి వృద్ది చెందుతుంది.

అరటి చెట్టు ని విష్ణు మూర్తి కి ప్రతీకగా చెప్పబడింది. గురు గ్రహ ప్రీతి కొరకు గురువారం రోజున అరటి చెట్టుని పూజిస్తారు. కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్నో ఉత్తమ కార్యాలకు వీటి ఆకులను పలు సందర్బాలలో వాడుతారు.

మామిడి చెట్టు ని యజ్ఞ యాగాదులలో లోను, ప్రతి శుభకార్యాలలోను వీటిని వాడుతారు. దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. ఇంటి ద్వారానికి వీటి ఆకులని కట్టడం ద్వారా ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే జ్ఞానం, ప్రశాంతత , మరియు అదృష్టం వృద్ది చెందుతాయని చెప్పబడింది.

వేప చెట్టు లక్ష్మీ స్వరూపం గా చెప్తారు. ఈ చెట్టు ని సాక్షాత్తు అమ్మవారి రూపం గా పూజించి ఆరాదిస్తారు. అధ్బుతమైన ఔషదగుణాలు కలిగిన ఈ వృక్షాన్ని చాలా  ఇళ్ళలో చూడవచ్చు. చర్మ, ఉదర, చిగుళ్ళు వంటి ఎన్నో సమస్యలకు ఉపకరిస్తుంది. ఈ వృక్షం ఇంట్లో ఉండడం ఆరోగ్యం తో పాటు సకల శుభాలు కలుగుతాయి.

అత్తి  చెట్టు ని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతీకగా చెప్పబడింది. వీటి పండ్లని చాలా  ఔషదాలలో వాడుతారు. ఈ చెట్టు ని పూజించడం వలన కుజ గ్రహం వలన కలిగే సమస్యలు తగ్గుతాయి. గ్రహాల పీడలనుండి ఉపసమనం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్న వారు ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానించి పూజించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. అవివాహితులు ఈ చెట్టు ని పూజించడం ద్వారా శీఘ్ర వివాహానికి కి కూడా అవకాశం కలదు.

ఉసిరిగ చెట్టు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పూజించటం వలన గ్రహ బాధలు బూత ప్రేతాది బాధలు తొలగుతాయి. శరదృతువు లో ఉసిరి చెట్టుని పూజించి ప్రదక్షిణాలు చేయడం వల్ల  శరీర రుగ్మతలు సమసిపోతాయి. బుద్ది కుశలత వృద్ధి చెందుతుంది. ఉసిరిక చూర్ణం, రసం శరీరానికి లేపనం వేసి స్నానం చేయడం వల్ల శరీర సౌందర్యం కాపాడబడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది చలి నుండి రక్షణ కలుగుతుంది. ఈ చెట్టు ని పూజించి దాని కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ చెట్టు గాలిని పీల్చడం వల్ల పైత్యప్రకోపం శమించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.

అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. పురాణాల ఆధారం గా యక్షులు ఈ చెట్టు పైన నివాసం ఉంటారని తెలుస్తుంది. అందువలన ఈ చెట్టు కింద ఏ దైవకార్యం చేసినా వెంటనే మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ గర్భ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కొన్ని రకాల మందుల తయారీ లో  అశోక చెట్టు ఆకులను వినియోగిస్తారు. ఆర్ధిక సమస్యలు, ఆలస్య వివాహ సమస్యలు , కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దైవ కార్యాలైనా ఈ చెట్టు కింద చేయడం వలన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ఇట్లు 
శివ పరివారం 

No comments:

Post a Comment