Wednesday, November 15, 2023

భగినీ హస్త భోజనం ... సోదరి ఇంట భోజనం

భగినీ హస్త భోజనం ... సోదరి ఇంట భోజనం 

ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ.కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే..అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. అమ్మ చేతి ముద్ద  మళ్లీ తినే భాగ్యం.. మనకి దక్కింది అంటే ఆ  అమ్మ ప్రతిరూపంగా  ఉన్న సోదరి కే మాత్రమే ఉంటుంది 
మనం బాగుండాలి అనుకునే  వారిలో అమ్మ తర్వాత సోదరి మాత్రమే.. మా అన్నదమ్ములు బాగుండాలి అని కోరుకునేది ఎంత మంది ఉన్నా ఆ ప్రేమ చెప్పలేదని ఒక్క సోదరి కి మాత్రమే ఉంది 
ఈ సంప్రదాయం ఇప్పడి డి కాదు మన పురాణం మనకి ఇచ్చిన బహుమానం.. ఈ భగినీ హస్త భోజనమే మనకి ఆదర్శం 
ఇక మనం విషయం లో కి వస్తే యమధర్మరాజు.. గురించి అందరికీ తెలుసు కదా  యమలోకపు చక్రవర్తి.. పాపపుణ్యాల లెక్క తేల్చే సమవర్తి.. యముడు యమున ఇద్దరు సూర్యుని సంతానం అన్నకు భోజనం పెట్టాలన్న ఎప్పటినుంచో ఆశ.. ఎన్ని సార్లు కబురు పంపినా తీరికే లేని ధర్మరాజు.. వృత్తి ధర్మం లో ఉండేవారు 
ఆ విషయం తెలిసి చెల్లెమ్మకు ఎన్నో సార్లు అంతులేని నిరాశ..ఎదురైంది . ప్రాణప్రదంగా ప్రేమించిన అన్నకేమో ప్రాణాలు హరియించే విధి.. సోదరికేమో  ఎదురుచూపుల నిశీధి..! ఏమి చేస్తాము 
ఇక సోదరి పిలుపు ఆ రోజు రానే వచ్చింది.. దీపావళి వెళ్ళింది.. ఎప్పటిలా చెల్లి నుంచి  యమునికి పిలుపు.. అన్నా అన్నానికి రా..అని.. ఈసారి యమధర్మ రాజు రాలేనని చెప్పలేదు 
వస్తానని చెప్పాడు  మరుసటి రోజు.. ఇంకేమి చెల్లికి పండగే.. అన్నకు నచ్చిన  పిండివంటలు , పాయసం మొ.. అన్ని మనసారా  ఏర్పాటు చేసింది , తానే స్వయం గా వడ్డించి తినిపించింది. యమధర్మరాజు  కడుపారా.. తిని చెల్లి తో చిన్ననాటి ముచ్చట్ల  మాట్లాడుకున్నారు . సోదరునికి ప్రేమను పంచి.. ఆ  అన్నాచెల్లెళ్ల పూర్వ అనుబంధం  ఇంకాస్త చిగురించి..! 
ఇక చెల్లెలకి  ఏం కావాలో కోరుకొమ్మని అడిగిన యమ ధర్మ రాజు  .. 
ఆమె సిరులడగలేదు.. సంపదలు కోరలేదు.. వరాలు  ఏమి కోరలేదు  . తన గర్భంలో  నిండు నీరిమ్మని వినుతించలేదు..మరి ఏం కోరిందో..??తెలుసుకుందామా 

అన్నా.. ఇదే కార్తీక శుద్ధవిదియ నాడు సోదరి ఇంట తిన్న అన్నకు అపమృత్యువు వద్దేవద్దు.. నరకవాసం అసలే వద్దని.. ఇదే నీ చెల్లికి  నువ్వు చెల్లించే ముద్దు..  ఇక నాకేమి కోరికే కద్దు.. అని అడిగింది. . తథాస్తు అన్న ధర్మరాజు.. యముని ఆనందానికి లేనే లేదు హద్దు.  అన్నలకు అపమృత్యునాస్తి.. చెల్లెళ్ళకు శాశ్వత పుస్తి.. యముని వరం.. యమికి సంబరం..! ఇదే కదా మన సంస్కారం . 
ఇక ఇది .పురాణమే అనుకో.. సంప్రదాయమే కానీ..  సోదరీ సోదరుల బంధానికి శాశ్వతత్వమే  ఈ భోజన తత్వం.. సోదరి సోదరుల  సంబంధాలు.. 
శాస్త్రం లో ఇంకో మాట కూడా ఉంది. ఎవరైనా  అన్న చెల్లలు లేదు అక్కా తమ్ముడు ఆనందం గా ఉంటారో అక్కడకి వాళ్ళ దగ్గరకి శని ప్రవేశించడు అని మన పెద్దలు చెప్తారు 
ఆప్తుల నడుమ , ఆస్తుల కోసం వివాదాలు.. అలకలు..దూరాలు.. నిందలు..ఆరోపణలు.. ఇవన్నీ సమసి.. రక్తబంధం విలువ తెలిసిన చోట  సాక్షాతూ యమధర్మ రాజు రావడానికి కొంచం ఆలోచిస్తారు .. అది వీడని బంథమని.. తెగని రుణానుబంధమని ఒక్కసారి పాశం వేసే ముందు ఆలోచిస్తారు అని చెబుతారు. అంత విలువైనది ఈ  భగినీ హస్త భోజనం 

ఈ పండుగను పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, 'యమవిదియ',  అని కూడా అంటారు . భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం కలిగింది 

ఇట్లు 
రాణీ సుబ్రహ్మణ్య శర్మ 



Friday, April 21, 2023

గంగా పుష్కరం (Ganga Pushkaram) 2023

 పుష్కర పురుషుడు  అనే దేవత ఒక్కొక్క నదిలో ప్రవేశించినపుడు ఆ నదికి పుష్కరం వచ్చింది అంటారు .

గంగా పుష్కరం (Ganga Pushkaram) అనగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగా నది యొక్క ఒక పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది.
పన్నెండు రోజులు గంగకు పుష్కర శోభ అన్న మాట .పుష్కర సమయం లో నదీ  స్నానం   సర్వ పాప హారం అని మన విశ్వాసం .అందులో పరమ పావని అయిన్క గంగా నది పుష్కరాలంటే ఒళ్ళంతా పులకరింతే .గంగా నది పుట్టిన గంగోత్రి నుండి సముద్రం లో కలిసే ఏ ప్రదేశం లో స్నానం చేసినా పుణ్యమే .అయితె కాశి  .ప్రయాగ ,హరిద్వార్ ,ఋషీకేశ్ లలో గంగా స్నానం చేసి ముక్తి పొందాలని అందరు భావిస్తారు .పుష్కరుడు సంవత్చారంకాలం గంగా నదిలో ఉంటాడు
నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి "పుష్కరం అంటే ఏమిటి? పుష్కరుడి తండ్రి ఎవరు? పుష్కరుడు తీర్థరాజెట్లయ్యెను?” చెప్పమని కోరెను.అప్పుడు బ్రహ్మ.. నారదా సార్థ త్రికోటి తీర్థాలు ఎక్కడ ఉండునో ఆ తీర్థమునకు పుష్కరమని పేరు. పూర్వము తుందిలకుడనెడి పరమ ధార్మికుడైన మునియుండెను. అతడు రేయింబవళ్ళు శివుడిని అర్చించి, ఆయన అనుగ్రహము వలన పుష్కరుడయ్యెను. శివానుగ్రహమును శివుని అష్టమూర్తులలో ఒకటైన జలరూపమును పొందియుండెను.

అతడు తీర్థరూపియైన పుష్కరుని నాకిచ్చెను. నేనాతనిని కమండలములో నుంచి సృష్టి చేయుచుంటిని.

ఇట్లుండగా ఒకప్పుడు అంగీరసుని కొడుకు బృహస్పతి తపస్సు చేసి నన్ను మెప్పించగా నీకేమి కావలెనో కోరుకొమ్మంటిని. అతడు 'నీవు నాకు ప్రసన్నుడవైనచో నాకు గ్రహాధిపత్యము, దేవతలలో గౌరవము, సర్వజ్ఞత్వమును ఇచ్చి, నీ కమండలములో నున్న తీర్థరాజగు పుష్కరుడు నా వశమగునట్లు చేయుమని' కోరెను.

అట్లే అని పుష్కరుని పిలిచి 'నిన్ను బృహస్పతి కిచ్చితిని, ఇంకప్పటి నుండి అతని ననుసరించుమనెను. పుష్కరుడు 'నేను మిమ్ము విడువజాలను, అనగా బ్రహ్మ.. 'నేను నిన్ను బృహస్పతికిచ్చినాను. నీవు వెళ్ళక తప్పదనెను. అప్పుడు పుష్కరుడు 'నేను మీతోనే ఉందును. మీరెచ్చటికి వెళ్ళిన నేనక్కడికి వత్తుననెను. బ్రహ్మ 'ఓ పుష్కరా! బృహస్పతి మేషాది రాశులలో చేరిననాటి నుండి పండ్రెండు రోజులు రేయింబవళ్ళును సంవత్సరమంతా మధ్యాహ్నవేళ రెండు ముహూర్తములున్నూ నీవా నదిలో ఉండవలెను. నేను నీతో కూడా ఉ౦డెదను అనెను.

బృహస్పతి పుష్కరుని పిలుచుకొని మేషాది రాశులలో ప్రవేశించినపుడు గంగాది నదులలో పుష్కరుడు సార్థత్రికోటి తీర్ధములతో సహా ఉండుచుండెను. ఆ సమయము పుణ్యకాలము కనుక అప్పుడు చేసిన దానములనంత కోటి ఫలములనిచ్చును. సమస్త నదులు, సమస్త తీర్థములున్ను అక్కడికి వచ్చి చేరును. అప్పుడు బ్రహ్మ, రుద్రుడు, విష్ణువు, ఇంద్రాది దేవతలు, పితరులు, ఋషులు అందరును స్నానము చేసి ఇక్కడనే ఉందురు. కాన అప్పుడు చేసిన స్నానము, దానము అక్షయ ఫలమునిచ్చును.

గంగానది పుష్కర విశేషాలు :

భారతదేశంలో అనేక పుణ్య నదులున్నాయి. ఈ పుణ్యనదులలో పుష్కరాలు జరిగేటటువంటి 12 నదులకు ప్రత్యేక స్థానమున్నది. అలాగే సనాతన ధర్మంలో గంగానదికి కూడా ప్రత్యేకమైన స్థానమున్నది. గంగానదిలో ఏ మానవుడైనా సంకల్ప సహితముగా సమయముతో పని లేకుండా స్నానమాచరిస్తే వారికి గంగానది యొక్క అనుగ్రహముచేత పుణ్యము లభిస్తుంది. అటువంటిది గంగానదిలో పుష్కర సమయంలో చేసేటటువంటి స్నానానికి కొన్ని వేల రెట్ల పుణ్యఫలం ఉంటుంది.

గంగానది పుష్కర సమయంలో ఏ మానవుడైనా గంగానదిలో సంకల్ప సహిత పుష్కరస్నానమాచరించడం, పుష్కరాలలో చేసేటటువంటి దానం, జపము, తపము, హెూమాలు మరియు తర్పణాలు వంటి వాటివి విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. గతించినటువంటి పితృ దేవతలకు గంగానది పుష్కరాలలో విడిచేటటువంటి తిలతర్పణాలకు విశేషమైనటు వంటి ఫలితము ఉంటుంది.

గంగానది పుష్కర స్నాన విధి:

పుష్కర స్నానము పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం చేసేటటువంటి స్నానము. పుణ్యాన్ని సంపాదించాలి అనేటటువంటి సంకల్పంతో స్నానాలు చేసేటటువంటివారు పుష్కరాలు జరిగేటటువంటి క్షేత్రాలలో భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానాన్ని ఆచరించాలి.

ఈ స్నానాన్ని పుష్కర స్నాన విధి ప్రకారం ఆచరించాలి. పుష్కర స్నానం ఆచరించేటటువంటివారు ఇంటియందే స్నానమాచరించి మగవారు అయితే పంచె కట్టుకొని పైన వస్త్రాన్ని వేసుకొని, స్త్రీలు చీర వంటి సౌకర్యమైనటువంటి వస్త్రమును ధరించి పుష్కరాలు జరిగేటటువంటి పుణ్యనది వద్దకు వెళ్ళాలి.

నదీ స్నానాన్ని ప్రారంభించే ముందు ఆ నదీమాతకు నమస్కరించి సంకల్ప సహితముగా పుష్కరస్నానాన్ని ఆచరించాలి. పుష్కర స్నానం ఆచరించేటప్పుడు సబ్బులు, షాంపులు వంటి వాటితో స్నానము చేయకూడదు. నదులలో ఆటలు వంటివి ఆడటం పాపము. పుష్కరాలు జరిగేటటువంటి నదులలో మలమూత్ర విసర్జన వంటివి చేస్తే పాతుకములోకి వస్తాయి

పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో ఆచరించడం ఉ త్తమం. పుష్కర స్నానం అయిన తరువాత దేవతలకు ఋషులకు నదికి అర్ఘ్యము, తర్పణాలు వంటివి వదలాలి. ఈవిధముగా భక్తిశ్రద్ధలతో సంకల్ప సహితముగా పుష్కర స్నానాలు ఆచరిస్తే గంగానది పుష్కర స్నాన ఫలితము లభిస్తుంది. 

గంగా..నిజంగా.. అదే గంగ.. 
పవిత్రతకు నెలవై.. తనలోనే  సకల దేవతలు కొలువై..
స్నానమాడే ప్రతిజీవి  మోక్షానికి చేరువై.. కోరిన కోర్కెలు
తీర్చే కల్పతరువై.. భువిపై జరిగే  అత్యద్భుత ఘట్టం..
గంగమ్మ పుష్కరం.. జగమునకెల్ల  అతిపెద్ద సంబరం..!

పన్నెండేళ్లకోసారి జరిగే మహోత్సవం.. ఒక్కో వత్సరం ఒక్కో నదికి
జరిగే బ్రహ్మోత్సవం.. పుష్కరం.. ఒక్కో రాశిలో  బృహస్పతి ప్రవేశం..
ఒక్కో నదికి పుష్కర సంబరం మేషమైతే గంగ.. అప్పుడే నువ్వు 
ఆ నదిలో మునుగంగ.. నీ జన్మ తరియింపగ..! 

ఏమి పుణ్యము  చేసినావయ భగీరథ..  దన్యమాయె కదా నీ కథ..
నీ సంకల్పమున చరితార్ధమైనది వసుధ..! గంగమ్మను కొలిచి...
ఇలకు పిలిచి.. ఆమె అహమును గెలిచి.. జటాజూటలునే మెప్పించి..
జీవధారను మోయ ఒప్పించి.. గళమున గరళము ధరించినావే..
తలపై గంగను భరించలేవా.. భగీరథుని వేడుక.. కరిగిపోవడం 
భోళా  శంకరుని వాడుక..మొదలైంది  ఇలా తలమునకు గంగమ్మ నడక..

బెంబేలెత్తించే ఉరక..పరమ రాజసభావ పరిచుంబితనితాంగ.. 
కదిలింది కదిలింది గంగ.. కదిలి ఉప్పొంగింది  ఉత్తుంగతరంగ..!
అలా అరుదెంచి  తాను తరిస్తూ.. మానవాళి పాపాలు హరిస్తూ..
శివయ్యను స్మరిస్తూ.. ఇలను అలగా.. జీవకోటి కోటి జన్మల కలగా..
పావన జలగా..గలగలగా..  పవిత్ర గంగగా..!
 
అటు చూడు ఆ నది..ఎంత అందమైన గమనమది.. 
జలజల పారుతూ..గలగల సాగుతూ..
చెంగుమని దూకుతూ..చెలరేగి ఆడుతూ..తుళ్ళుతూ..తూగుతూ..!
పన్నెండేళ్లకు పుష్కరాలు పన్నెండు రోజుల పురస్కారాలు..
సూర్యనమస్కారాలు.. సంస్కారాలు..అపురూప ఆవిష్కారాలు

గంగోత్రి.. పావన అభినేత్రి.. స్త్రీ రూపు దాల్చిన త్రినేత్రి..
గంగాసాగర్.. నది అనాదియై..సాగరమై.. కైలాసనాధుని లయమై..
ముక్కంటి నిలయమై.. హరిద్వార్.. తాను ప్రవహించిన తావెల్ల
హరి ద్వారమై..అబ్బురమై.. గమనమే సంబరమై... 
బదరీనాథ్.. కేదారనాథ్.. అలహాబాద్.. పరాకాష్టగా..
అంతేలేని నిష్టగా వారణాసి..  ముక్కంటి వాసి...
ఆయనే మెచ్చి మోసిన లావణ్యరాసి.. గంగాధరునిగా పేరు మోసి..
పార్వతమ్మ  రుధిర దృక్కును కాసి.. ఎన్నో అద్భుతాల కాశి..!
ఘాట్లు..పాపాలకు తూట్లు..మూడు మునకలతో  మోక్షమే కానుక..
వదిలిపోయే దేవుని కినుక.. అపురూప వేడుక..! 

కదిలింది కదిలింది గంగ.. సద్గతులను ఒసగంగ..  
తాను భాగీరదిగా.. నిను దేవునిదరి చేర్చే  పవిత్ర వారధిగా..! 





Friday, February 17, 2023

నలదమయంతుల కధ.

నలదమయంతుల కధ.
      
💐  కలి దోషం పోవాలంటే.. ఒకసారి ఈ కథ చదవండి.💐ఓం శని ఈశ్వరాయనమః.

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. 
ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. 
అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, 
నీ వెంట నీ అన్నదమ్ములు, 
నీ భార్యా, 
నీ హితం కోరే విప్రులు 
నీ వెంట ఉన్నారు. 

పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, 
పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. 
అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు.

బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. 
తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. 
అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. 
ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. 
చాలా కాలం అతనికి సంతానం లేదు. 
అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, 
దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. 
దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. 
దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, 
ఆమె సౌందర్యం గురించి విన్నాడు. 
ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.

నలదమయంతుల మధ్య హంస రాయబారం..💐
ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసలగుంపు వచ్చి అక్కడ వాలింది. 
ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. 
మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. 
నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. 
నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, 
నీ అందచందాల గురించి..
గుణగణాల గురించి చెప్పి..
నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. 
ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, 
దానిని విడిచిపెట్టాడు. 

ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. 
అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. 
చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. 
ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. 
నలుడు సౌందర్యవంతుడు, 
సంపన్నుడు, 
సద్గుణ వంతుడు. 
నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. 
ఆ హంస అలాగే చేసింది. 
ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

దమయంతి స్వయంవరం..💐
నల దమయంతుల వివాహం.💐
నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. 

ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. 
నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. 
ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్ద్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. 
నలుడు "అలాగే చేస్తాను. 
ఇంతకీ మీరెవరు? 
నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. 
ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి..
ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. 
నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? 
నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, 
ఈ కార్యం చేయవలసిందే. 
ఇది దేవతాకార్యం, 
నీవు చేయగలవు. 
మాట తప్పడం ధర్మం కాదు. 
మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. 

గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. 
నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. 
దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. 
దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? 
ఎక్కడి నుండి వచ్చారు? 
ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. 
నలుడు దమయంతితో "నా పేరు నలుడు. 
నేను దేవదూతగా వచ్చాను. 
దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. 
నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. 
"అయ్యా! నేను మానవకాంతను. 
నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను.

నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. 
మీరే నాభర్త, 
కనుక నన్ను స్వీకరించండి. 
లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, 
ఇతరులను వరించను" అని దమయంతి ప్రార్థించింది. 
నలుడు దమయంతితో "దమయంతీ! 
దేవతలు ఐశ్వర్యవంతులు, 
జరా మరణాలు లేని వారు, 
వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. 
ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. 
ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. 
అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. 
అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. 
ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. 
అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. 
స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. 
దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. 
మనస్సులో ధ్యానించి "దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. 
మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. 
నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

నలదమయంతులపై కలిప్రభావం..💐
రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళుతున్న నలుడు.💐

దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా, దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. 
ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. 
"భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు. 
అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగింది. 
ఆమె నలుని వివాహమాడింది" అన్నారు. 
కలికి కోపం వచ్చింది. 
నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. 
నలుడు ధర్మాత్ముడు, 
కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. 

ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు. 
ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. 
నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు. 
బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. 
జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని, 
నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. 
జూదం మొదలైంది. 
నలుడు తనరాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు..
అయినా ఆడటం మానక, 
సమస్తం పోయే వరకు ఆడాడు. 
దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది. 
పుష్కరుడు గెలవటం, 
నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. 

నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి, 
నగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు. 
జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. 
ఆకలికి తట్టుకోలేక పోయాడు. 
ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. 
ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. 
నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. 
ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. 
ఇది, నీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. 
ఇది, దక్షిణ దేశానికి పోయే మార్గం, 
ఇది కోసల దేశానికి పోయే మార్గం, 
ఇది ఉజ్జయినికి పోయే మార్గం.. 
వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. 
నీవు అడవులలో కష్టాలు పడలేవు, 
నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము" అని చెప్పింది. 
నులుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, 
రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. 
అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం.. 
అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. 
అందుకని నీవు పక్కన ఉంటే, 
ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. 
దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది. 
అందుకు నలుడు అంగీకరించాడు.

నలదమయంతుల వియోగం..💐
ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. 
అమెను చూసి నలుడు "ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. 
నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. 
నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖ పడుతుంది" అని మనసులో అనుకుని, 
తాను ధరించిన చీరభాగాన్ని చింపి, 
పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. 
నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. 
భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగు తున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. 
భయంతో దమయంతి కేకలు వేసింది. 
ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. 
ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, 
ఆమెను తాకబోవగా, 
దమయంతి అతనిని భస్మం చేసింది.

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, 
ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. 
అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. 
మునులు దమయంతిని చూసి "అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగారు. సమాధానంగా దమయంతి "మునిపుంగవులారా! 
నేను నలచక్రవర్తి భార్యను. 
నా పేరు దమయంతి. 
విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. 
నాకు వారి జాడ చెప్పగలరా? 
నేను భర్త లేనిదే జీవించ లేను" అని అడిగింది. 
మునులు "అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. 
చింత పడకుము" అని చెప్పి, వెళ్ళారు. 
దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ 
ఆ అడవిలో తిరుగుతూ ఉంది. 
ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసారు. 
కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. 
కొందరు ఆమెకు మొక్కారు. 
వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని "అమ్మా! నేను నలుని చూడలేదు, 
కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము" అన్నాడు. దమయంతి వారితో "నేను కూడా మీ వెంట వస్తాను" అన్నది. 

ఆవ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. 
వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. 
వారిలో చాలామంది మరణించడం చూసి, 
దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. 
తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను 
కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. 
ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. 
ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. 
రాజమాత దమయంతితో "అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతుంది. 
నీవు ఎవరు?" అని అడిగింది. 
దమయంతి "అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. 
నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. 
అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను" అని చెప్పింది. రాజమాత "అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. 
నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. 
నీ భర్తను వెతికిస్తాను" అని చెప్పింది. 
దమయంతి అందుకు అంగీకరించి "అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, 
పరులకు కాళ్ళుపట్టను, 
పరపురుషులతో మాట్లాడను. 
కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను" అని చెప్పింది. 
రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. 
దమయంతి అక్కడే ఉండిపోయింది.

నలుడు వికృతరూపుడగుట..💐
దమయంతిని వదిలివెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా, అడవి అంతటా దావానలం వ్యాపించింది. 
ఆ మంటల మధ్యనుండి "రక్షించండి రక్షించండి" అన్న ఆర్తనాదం వినిపించింది. 
ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగ కుమారుని రక్షించాడు. 
ఆ పాము నలుని కాటు వేసింది. 
పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షం అయి నలునితో "నలమహారాజా! నా పేరు కర్కోటకుడు. 
నేను నిన్ను కాటువేసానని భయపడకు. 
ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. 
పాముకాటు నిన్ను ఏమీ చేయదు. 
నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, 
నీ భార్య నీకు దక్కుతుంది, 
నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా, 
నన్ను తలచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. 
దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. 
నీకు మరొక విషయం చెప్తాను.. 
ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన రుతుపర్ణుని రాజ్యం ఉంది. 
నీవు అక్కడికి వెళ్ళు. 
బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రధసారధిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విధ్యను ఇచ్చి అతనినుండి అక్షహృదయం అనేవిద్యను గ్రహించు", అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. 
నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. 
అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. 
నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. 

ఎక్కడ ఉన్నా, నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు. 
ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తూండగా జీవలుడు విని ఈ వికృతరూపి ప్రియురాలు ఎంత వికృతరూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి, 
విషయం ఏమిటని అడిగాడు. 
అందుకు నలుడు జీవలునితో "అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా. 
నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూసాను. 
అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను" అన్నాడు.

దమయంతి విదర్భ దేశానికి చేరుట..💐
విదర్భదేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. 
తన కూతురు, అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. 
వారిని వెదకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. 
ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. 
ఛేదిదేశం చేరిన బ్రాహ్మణుడు, దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. 
అతడు దమయంతితో "అమ్మా! నేను నీ తండ్రి వద్దనుండి వస్తున్నాను.

అక్కడి వారంతా క్షేమం. 
నేను నీ సోదరుని మిత్రుడను" అనగానే దమయంతి వారిని తలచుకుని పెద్దగా రోదించింది. 
అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి "బ్రాహ్మణోత్తమా! ఈమె ఎవరి భార్య? 
ఎవరి కూతురు? 
ఇలా ఉండటానికి కారణం ఏమిటి?" అని అడిగింది. అందుకు అతడు "అమ్మా! ఈమె విదర్భరాజు కుమార్తె. నలచక్రవర్తి భార్య. 
ఈమె పేరు దమయంతి. 
అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. 
భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికివచ్చి ఈమెను గుర్తించాను" అన్నాడు. 
అది విని దయంతిని కౌగలించుకున్న రాజమాత "దమయంతీ! నీవు నాకు పుత్రికా సమానురాలివి. 
నేను, నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. 
నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. 
నేను వీరబాహును వివాహమాడాను" అన్నది. 
అందుకు అందరూ ఆనందపడ్డారు. 
దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది.

దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించుట..💐
రాజ సౌధంలో ఉన్నా దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. 
ఆమె తనతండ్రితో "నా భర్తను తక్షణం వెతికించండి. ఆయన లేకుండా నేను బ్రతక లేను" అన్నది. 
భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పాడు. 
వారితో దమయంతి ఇలా చెప్పింది. "నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, 
మారు వేషంలో ఉంటాడు. 
మీరు వెళ్ళిన రాజ్య సభలలో ఈ విధంగా ప్రకటించండి. "నీవు సత్యసంధుడవు కాని, 
నీ సతిని వంచించావు. 
ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. 
అలా చెయ్యడం ధర్మమా? 
నాపై కరుణ చూపు" అని చెప్పండి. 
ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే, 
నా వద్దకు వచ్చి చెప్పండి" అన్నది. 
అలా నలుని వెదకడానికి వెళ్ళినవారంతా నలుని జాడ తెలుపక పోయినా, 
వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, 
సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది' అన్నాడు" అని దమయంతితో చెప్పాడు. 
దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. 
తన అనుమానం దృఢపరచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. 
"సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో, "రాజా! భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. 
భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. 
మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు" అని చెప్పు" అని చెప్పి పంపింది. 
సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు.

నలుడు స్వయంవరానికి బయలుదేరుట..💐
దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? 
అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. 
నాకు చూడాలని ఉంది. 
ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. 
నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. 
సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, 
కాని అది నిజంకాదు. 
నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. 
అని దుఃఖించాడు. 
"అయినా దమయంతి పతివ్రత. 
ఇద్దరుపిల్లల తల్లి. 
ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో? 
ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు. 

వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. 
ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, 
బాహుకుడు అనూరుడిలాఅనిపించింది. 
పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనసులో అనుకున్నాడు. 
ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. 
బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. 
అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు. 
అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. 
తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. 
అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. 
ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. 
బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు.

ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. 
అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు.
ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు. 
అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. 
తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. 
నలుడు ఆగ్రహించి శపించబోయాడు. 
కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను. 
ఇంతకంటే శాపం ఏముంది, 
నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. 
ఆ ఘోష విని, దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. 
కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. 
ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. 
బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

తిరిగి కలుసుకున్న నల దమయంతులు.💐
దమయంతి తన దాసితో "వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. 
వారు నాకు తెలుసు, 
కాని వారి వెంట ఉన్న కురూపి ఎవరు? 
అతనిని చూసి నా మనసు పరవశించి పోతుంది. 
అతని వివరాలు తెలుసుకుని రా" అని పంపింది. 
దాసి నలుని వద్దకు వచ్చి "అయ్యా! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది" అని చెప్పింది. 
నలుడు "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చాను అని చెప్పు "అన్నాడు. 
"మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు?" అని దాసి అడిగింది. 
నలుడు "అతడు వార్ష్ణేయుడు. 
ఇంతకు ముందు నలుని సారధి" అన్నాడు. 
దాసి "అతనికి నలుని జాడ తెలుసు కదా?" అని అడిగింది. 
నలుడు దాసితో "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. 
నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, 
వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు. దాసి "అయ్యా! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీర ధరించి కాలం గడుపుతోంది. 
ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది. 
అది దాసికి తెలియ కూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. 

దమయంతి దాసితో "సందేహం లేదు, 
అతడు నలుడే. 
అయినా ఈ వికృత రూపం ఏమిటి? 
అతను వంటవాడు అని చెప్పారు కనుక, 
వంట ఎలా చేస్తాడో పరీక్షించు" అని పంపింది. 
దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి "అమ్మా! అతను సామాన్యుడు కాదు. 
అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. 
వంట పూర్తయే వరకు అలా మండు తున్నాయి. 
వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది. 
దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి "సందేహం లేదు, 
ఇవి నలుని వంటలే" అని గ్రహించి, 
దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. 
నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో "అమ్మా! ఏమీ అనుకోవద్దు, 
వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలాచేసాను. 
ఇక నువ్వు నా వద్దకు రావద్దు. 
ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. 
అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిధులం 
మాతో నీకేం పని?" అన్నాడు. 
ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. 
అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, 
నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు" అని అడిగింది. 
భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. 
దమయంతి నలుని చూసి, "అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. 
అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను? 
అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. 
నలుడు "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. 
అందువలన నేను అలా చేసాను. 
జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించ లేక, నిన్ను విడిచి వెళ్ళాను. 
అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను. 
నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. 
మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? 
అలా ఎందుకు చేసావు? 
అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు.

ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. దమయంతి "నాధా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. 
మిమ్మలిని రప్పించుటకే ఇలా చేసాను. 
మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? 
నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అని 
మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను" అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. 
వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. 
నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. 
నలుడు కర్కోటకుని స్మరించాడు 
వెంటనే ఒక వస్త్రం వచ్చింది. 
అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. 
దమయంతిని పరిగ్రహించాడు.

నలదమయంతులు రాజ్యాన్ని పొందుట..💐
సభలో నల దమయంతులు.💐
నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, 
తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిసాడు. 
నలుడు పుష్కరునితో "పుష్కరా!జూదమాడటం నీకు ప్రియం కదా. 
నేను నా భార్య దమయంతిని ఫణంగా పెడతాను, 
నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? 
లేదా నాతో యుద్ధం చెయ్యి, 
ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. 
నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అన్నాడు. 
పుష్కరుడు జూదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అన్నాడు. 
నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. 
పుష్కరునితో "పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినపుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు. 
కనుక ఓడి పోయాను, 
నీబలం వలన కాదు. 
నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, 
నిన్ను ఏమి చేయను వెళ్ళు" అని చెప్పి పంపాడు.

ఫలశ్రుతి:.💐
ఈ నలుడి గాధ శ్రద్ధతో వినేవారు, 
సమావేశాలలో చదివి వినిపించేవారు, 
కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, 
వినిపించిన వారికి కూడా లభిస్తాయి. 
అటువంటి వారికి బహుపుత్రలాభం, 
పౌత్రవృద్ధి, 
ఆయురారోగ్యధనసంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, 
చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు! 
వారు ధర్మాత్ములు కాగలరు.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణశ్చ రాజర్షే కీర్తనం కలినాశనం ||

కర్కోటకుడనే నాగుడిని, 
దమయంతిని, 
పుణ్యశ్లోకుడైన నలుడిని, 
ఋజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని 
ధ్యానించి కీర్తించిన, కలిభయాలు తొలగగలవు..
స్వస్తి..!

Friday, February 3, 2023

కళాతపస్వి విశ్వనాథ్ కు నీరాజనం

 



వెండితెర మరోసారి చిన్నబోయింది.. తన కీర్తిని ఖండాంతరాలకు తీసుకుపోయిన స్రష్ట ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోగా
తెలుగు కళామతల్లి మౌనంగా రోదిస్తోంది. అసలు సినిమా అంటే కుప్పిగంతులు., వెర్రి కేకలు.. చెవులు అదిరిపోయే మాటలు..
అర్థం కాని పంచులు..ఇవి కావంటూ..సినిమా అంటే కళ.. నృత్యసంగీత సంప్రదాయాల మేళవింపు.. ఇవన్నీ రంగరించి కలయపోస్తేనే  సినిమా అని 
ప్రతి ఒక్క సినిమాలో ఒక అర్థం.. ప్రతి కథలో పరమార్థం.. ప్రతి సన్నివేశంలో  ఒక అందం.. ప్రతి పాటల్లో మకరందం..ఆ మాటల్లో భావుకత.. 
పాత్రధారుల్లో పరిపూర్ణత.. అభినయంలో పరిపక్వత.. మొత్తంగా అందమైన కాన్వాస్.. కళాతపస్వి శ్రీ విశ్వనాధుని సినిమా..! 

మా ఇంట్లో మా నాన్నగారు కి విశ్వనాద్ గారు సినిమా ఉంటె చాలు ఎన్ని సార్లు చూసే వారో.. అప్పట్లో క్యాసెట్ , మా చిన్నతనం లో మా నాన్నగారు  శంకరాభరణం , సాగర సంగమం , మొ. సినిమాలు ఎన్ని సార్లు చూసే వారో లెక్క లేదు.. 

తెలుగు సినిమాకి కొత్త నడకను నేర్పిన..నాట్యాన్ని మప్పిన.. అర్థం కాని పరుగులను కాక అందమైన గమనాన్ని చూపిన దార్శనికుడు కాశీనాథుని విశ్వనాథ్!
పాటల్లో శృతి.. ఆటల్లో లయ.. మాటల్లో భావం.. కథలో సందేశం.. సన్నివేశంలో పట్టు.. అదంతా ఆ విశ్వనాధుని కనికట్టు..! 

విశ్వనాథ్ గారు మూగమనసులు డాక్టర్ చక్రవర్తి వంటి సాంఘిక చిత్రరాజాలకు ఆదుర్తి సుబ్బారావు 
వద్ద పని చేసి సినిమాని పండించడంలో మెళకువలు ఔపోసన పట్టి ఆత్మగౌరవం తో దర్శకుడిగా
చేబట్టి  నేను సైతం అంటూ దర్శక ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.మొదట్లో గురువు ఆదుర్తి బాటలోనే ప్రయాణం సాగించారు 

తన పేరుకు ముందు కళాతపస్వి అనే కీర్తి రావలసి ఉండగా ఆగుతాడా..ఆ దిశగా పడింది మొదటి అడుగు సిరిసిరిమువ్వ
తో.. వేస్తూ ఝుమ్మంది నాదం.. సై అంది పాదం..అని తన   ప్రతిభతో  నటరాజు శత సహస్ర రవితేజుడై.. నటగాయక వైతాళిక మునిజన భోజుడై..
అతడు సరికొత్త అవతారం దాల్చగా వెండితెర మురిసింది.. తనువూగి ఆ వేళ.. చెలరేగి ఒక రాసలీల..! 

అప్పట్లో కమర్షియల్ సినిమాలు విజృంభించి  వీరవిహారం చేస్తున్న వేళ..మహానటులు సైతం అదే మూసలో పడి
తమ స్థాయికి తగ్గ అభినయాలు మరచిన  సమయాన..విశ్వనాథుడు సెల్యులాయిడ్ పై  చేసిన అతి గొప్ప ప్రయోగం శంకరాభరణం! . అది శంకరునికి ఒక ఆభరణం 
అనుకుని ఆ విశ్వనాథుడు సమర్పించ హరమ్ 

ఒక పాత్రను సృష్టించి.. దాని చుట్టూ అద్భుతమైన కథను ఆవిష్కరించి.. అపూర్వమైన పాటలను సంధించి...మునుపెన్నడూ చూడని డ్రామాను జోడించి..
నాటి సినిమాలకు సరిపడని క్లైమాక్సును రంగరించి.. అద్భుతమైన పాత్రలను పొదిగి..ఇన్నీ సిద్ధం చేసుకుని నాయకుడెవరు అనే దగ్గర మీమాంస..నిజానికి కథే నాయకుడై..పెద్ద నాయకుడు అవసరం లేని సినిమా కోసం వెతికి పట్టుకున్న ఆణిముత్యం మన జేవీ సోమయాజులు గారు ..ఆ పాత్ర ఆయన కోసం పుట్టిందా..
ఆయనే ఆ పాత్ర కోసం పుట్టాడా..అన్నంతగా మమేకమైపోయిన చేసారు శాస్త్రి గారు ఆయనకి. శంకరాభరణం శంకరశాస్త్రి..! అనే నామధేయం శాశ్వతం గా ఇచ్చేసారు 
తెలుగు సినిమా చరిత్రలో ఒక వేణువు..నిఘంటువు.. విశ్వనాథుడు అయ్యాడు దర్శక మేరువు.. కళాత్మకతకు గురువు..! 
ఇలా చెప్పుకుంటూ వెళితే. ఎక్కడ మొదలు పెట్టాలో , ఎక్కడ పూర్తి చెయ్యాలో తెలియని పరిస్థితి. 
ఇక మొదలైంది విశ్వనాథ  జైత్రయాత్ర.. కళాత్మక సినిమాల విజయయాత్ర ..సినిమా అంటే మసాలా దట్టింపు మాత్రమే కాదు సంగీతనాట్యాల అద్భుత మేళవింపు అని మామూలు జనాలకు.. సినిమా జనాలకు కూడా బోధపడేలా చేసిన విశ్వనాథుడు తానయ్యాడు కళాతపస్వి.. చిరయశస్వి..!
ఇప్పటికీ మేము మా పిల్లలు ఆ సినిమా పాటలు ఆ సినిమాలే చూస్తున్నాము 
ఇక ఆగలేదు ఆ గమనం.. అద్భుత కళాఖండాల ఆగమనం.. హృదయంగమం అదే సాగరసంగమం.. 
ఆణిముత్యం స్వాతిముత్యం.. పాటల హొయలు  శృతిలయలు శ్రమజీవి నాయకుడై.. స్వయంకృషి.. తానూ నటుడై.. కమల్ అభినయానికి
పట్టం కట్టిన శుభసంకల్పం పాటకు పట్టాభిషేకం స్వరాభిషేకం.. ఇవన్నీ ఒక కోవ.. నిజమైన కళా జగతికి ద్రోవ.. దొరకునా ఇటువంటి సేవ..
కళాతపస్వి మెలకువ.. ఆయనకే చెల్లిన అత్యద్భుత సినీగీతాల కువకువ..! 
సంగీతం రాని ఓ మనిషి తానే రుషిగా మారి సృష్టించిన కళాఖండాలు
తెలుగు తెరను సుసంపన్నం చేశాయి..గొప్ప సినిమాలను మనకు అందించి దన్యులను 
చేసిన కాశీనాధుని విశ్వనాధునికి ఏమిచ్చి..ఏమని చెప్పి తీర్చుకోగలం రుణం.. నా ప్రాణదీపమై 
నిను గొల్చువేళ  మహానుభావా.. అంటూ శిరస్సు వంచి ప్రణమిల్లడం తప్ప..!

వెండితెరను స్వర్ణమయం  చేసిన కళాతపస్వి.. మహా మనస్వి.. అపార తేజస్వి.. చిరయశస్వి.. 
ఇక లేరంటే..తిరిగి రారంటే.. గుండెకు గాయం కదా.. అదెప్పటికీ నయం కానిదా..! 

ఒక్కసారి కళ్ల ముందు తిరుగుతున్న రీళ్లు.. సినిమాలు కావవి  దృశ్యకావ్యాలు.. అపురూపంగా నర్తిస్తున్న
సిరిసిరిమువ్వ.. అద్భుతంగా అభినయిస్తున్న సీతామాలక్ష్మి.. కళ్ళెదుట కూర్చుని పాడుతున్న శంకరశాస్త్రి..
అభినయపరాకాష్ట సాగరసంగమం.. పురోగమన భావాల జలనిధి సప్తపది.. అపూర్వ చిత్రరాజాల
సినీమా రుషి దర్శకత్వ ఖుషి..  స్వయంకృషి..

కాశీనాథుని ఆగమనమే తెలుగు సినిమాకి  శుభోదయం..  శుభసంకల్పం..
శుభప్రదం.. పెరిగిన దర్శకుల  ఆత్మగౌరవం.. కళాఖండాల ఆవిర్భావానికి 
వెలుగురేఖ శుభలేఖ వెండితెరపై అందంగా పరచుకున్న సిరివెన్నెల...
దర్శక దిగ్గజం ప్రతి సినిమా ఒక స్వాతిముత్యం..  మహానటులు  చిన్ననాటిస్నేహితులు
ఎందరో మహానుభావులు ఆయన విజయాల్లో సూత్రధారులు.. గొప్ప సినిమా ఆయన జీవనజ్యోతి

మొత్తంగా సినిమా విశ్వనాధుని జీవితనౌక మంచి సినిమా కోసం  
ఆర్రులు చాచిన  అభిమానులకు ఆయన ఆపద్బాంధవుడు..!  చిరంజీవుడు 

మనకు ఎన్నో కళాఖండాలను అందించిన అభిమాన దర్శకుడు కళాతపస్వి విశ్వనాథ్ కు 
ఆయన సినిమా పేర్లతోనే అక్షరనీరాజనం.. 

PART 2 


మూడు ఫై(ఫీ)ట్లు.. ఆరు పాటలు(పాట్లు) ఉంటేనే సినిమా అనే ఈ రోజుల్లో  సంగీతం నాట్యం సాహిత్యం మొ కళాత్మక మైన సినిమాలు ను మనకి అందించిన 
మహాదేవుడు , విశ్వనాధుడు కి  శిరస్సు వంచి నమస్సుమాంజలి 
శిశుర్వేత్తి పశుర్వేత్తి.. మీ  చెయ్యే తెలుగు సినిమాకి పరశువేది..
తొంభై మూడేళ్ల కళాతపస్వి  మరో సప్తపది పూర్తి చేసి సెంచరీ కొట్టాలని కోరుకుంటున్న తరుణంలో
దిగ్బ్రమ కలిగించే వార్త.. విశ్వనాథుడు ఇక లేరని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము..సినిమాలంటే 
ఇలా ఉండాలని తెలుసుకున్నాం. సినిమాతో ముడి వేసుకున్న ప్రేమబంధం ఆయనది.. 
కళాత్మక చిత్రం ఆయనకు శంకరాభరణం.. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ
దొరకని కీర్తి  ఆ ధన్యమూర్తిది.. అశ్రునయనాలతో పితృతుల్యునికి అక్షర నివాళి.. 


కాశీనాథుని వారింట  పుట్టిన చిరయశశ్వి జనం నాడి  పట్టిన కళాతపస్వి.. 
సినిమా ఆయన చిరునామా.. కళాఖండాలకు  ఈ విశ్వనాధుడే శరణమా..
ఆయన లోగిలే  కళాసరస్వతి చరణమా.. శంకరాభరణమా..!

సినిమా బాగుందిరా.. సొమ్ములు రావు.. 
అలాంటి టాక్ పై అటాక్ చేసి కళాత్మక సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకబ్రహ్మ..
ఇది అవార్డు మూవీరా.. పెట్టుబడి వెనక్కి రాదు.. ఇలాంటి మాటలకూ స్వస్తి చెప్పించి నిర్మాతలకు
డబ్బుల మూటలు అప్పజెప్పిన ఆయన సినిమాలే ఏడిద వారి నట్టింట పూర్ణోదయం..
తెలుగుతెరకు శుభోదయం..!

సినిమాని పరిశ్రమగా పూజించి షూటింగుల్లో ఖాకీ దుస్తులు  ధరించే శ్రమజీవి..
తెలుగు సినీరంగానికి  ఆదుర్తి అందించిన స్వాతిముత్యం..
నిర్మాతల పాలిట ఆపద్భాందవుడు.. స్వయంకృషి తో ఎదిగిన
దర్శక రుషి.. క్లాప్ కొట్టడమే శుభసంకల్పం.. దర్శక వాల్మీకిలా
ఆవిష్కరించె ఓ సీత కథ..! 
సంగీత కళాకారుడు కాకపోయినా విశ్వనాధుడు
గొప్ప పాటల విరించి.. ఆయన ప్రతి సినిమా 
అద్భుత గీతాల మరీచి.. ఆయన సినిమాల్లో పాటలు
మండుటెండలో సిరివెన్నెల.. స్వరజ్ఞానం లేని కూనిరాగాలకూ 
సమకూర్చు శ్రుతిలయలు.. ఆయన తీసిన  సినిమాలలో పాటలే 
విజయాల సూత్రధారులు..! 
కళాతపస్వి బాణి.. కళాత్మక చిత్రాలకు  చెల్లెలికాపురం తో 
పడిన బోణి.. తెలుగు సినిమాకి విశ్వనాథుడు సింగారించిన
కళాఖండాల నీలవేణి.. తులసి గా మారిన  మంజుభార్గవి 
అనే పూబోణి శంకరశాస్త్రి కుమార్తె శారద గా
పరిచయమైన రాజ్యలక్ష్మి  అనే అలివేణి..
ఆయన ప్రతి సినిమాలో నాయిక కళల పట్టపురాణి..!

అసభ్యతకు తావులేని రసరమ్యత.. స్వాతిముత్యం లో 
జలపాతంలో హిమపాతంలా రాధిక  స్నానం.. 
సాగరసంగమం లో జయప్రద అభ్యంగనం... 
ఎబ్బెట్టుగా అనిపించని మన్మధబాణం..
అదే కళాతపస్వి వశీకరణం.. అవార్డు చిత్రాల తోరణం..
తెలుగు వాకిళ్ళలో  కళాఖండాల పచ్చతోరణం..!

మొత్తానికి విశ్వనాథుని రాక తెలుగు చిత్రరంగానికి ఏరువాక..
సంప్రదాయ సినిమాలకు శుభలేఖ.. పులకించిన 
జననీ జన్మభూమి ఇన్నిన్ని గొప్ప అనుభూతులను పంచిన 
ఓ కళాతపస్వీ..  నీ వైభోగమును స్తుతిస్తూ  ఓ కవిత  రాసే భాగ్యం.. 

దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల జేరు
నిర్వాన సోపానమధి రోహణము సేయు త్రోవ.. 
రాగాలనంతాలు  నీ కళారూపాలు.. భవరోగ తిమిరాలు 
పోగార్చు దీపాలు.. నా ప్రాణ దీపమై
నాలోని జీవమై నిను గొల్చువేళ మహానుభావా మహానుభావా...!
  


Friday, January 27, 2023

రధసప్తమి - శ్రీ సూర్య నారా (నామా )యణ౦

 శ్రీ సూర్య నారా (నామా )యణ౦

మన పూజ్య గురువు గారు చెప్పినట్టు గా ఈ మాసమే పవిత్ర మాసం.. మాఘ మాసం మాధవ మాసం అని..ఈ మాసం లో వచ్చే ప్రతి రోజు ఒక మహా పర్వ దినమే. 

రేపు అత్యంత పరమ పవిత్ర మైన రోజు .  రేపటి రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ  పర్వ దినం రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం."సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ  

ఎవరైనా సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టాలన్న మంచి రోజు ,  విశేషఫలం ఉంటుంది. అలాగే  గురువు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది. 

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః 

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!! 

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! 

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!! 

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! 

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! 

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!! 

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి. అని శాస్త్ర ఉవాచ 

ఈ జన్మలో చేసిన,  జన్మాంతరాలలో చేసిన, మనస్సుతో, మాటతో, శరీరంతో,  తెలిసీ, తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. 


కొందరికి ఈ రధ సప్తమి కి పూజ  రధం వేసి చిక్కుడు కాయలతో స్వామి వారిని పూజిస్తారు.. కొందరికి అవి ఆనవాయితీ గా వస్తుంది 

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని వేసి నమస్కరిస్తారు  

మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా  ‘’అమరకోశం ‘’లో –

‘’సూరా ,సూర్యార్యమాదిత్య ద్వాదశాదిత్య దివాకరాః-భాస్కరా హస్కర బ్రద్న ప్రభాకర విభాకరాః-భాస్వద్వివస్వ త్సప్తాశ్వహరి దశ్వోష్మ రస్మయః –వికర్తనార్క మార్తాండ మిహిరారుణ పూషణః-ద్యుమణి స్తరణిర్మిత్రశ్చిత్ర భాను ర్విరోచనః –విభావసు ర్గ్రహ పతి స్త్వషాంపతి రహర్పతిః-భానుర్హంస స్సహస్స్రా౦శు స్తపన స్సవితా రవిః’’అని చెప్పి ఇవికాక

‘’కర్మ సాక్షీ జగచ్చక్షు రంశుమాలీ త్రయీతనుః –ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోక బాన్ధవః –సురోత్తమో ధామ నిధిః పద్మినీ వల్లభో హరిః’’అనీ చెప్పింది .

కనుక రధ సప్తమీ పర్వదినాన సూర్య నారా (నామా )యణ రహస్యాలను తెలుసుకొని తరిద్దాం .దీని వివరణ అంతా ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ రచన ‘’కదంబ వనం ‘’లో ‘’ప్రత్యక్ష దైవం సూర్యుడు ‘’వ్యాసం లో తెలియ జేశారు .

సూర్యుని ముఖ్యనామాలు 37 .ఇవికాక మరో 12 తో కలిపి 49 పేర్లు ఉన్నట్లు పైన చెప్పబడిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది .ఇవన్నీ గుణాలను బట్టి ఏర్పడ్డాయి .నామాధిక్యం గుణాధిక్యానికి సూచన .పై పట్టిక లో ‘’ఇన’’శబ్దం లేదు .ముందు దాన్ని గురించి తెలుసుకొందాం ‘’ఏతి ఇతి ఇనః ‘’అంటే సంచరించేవాడు .సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని విజ్ఞానశాస్త్రం చెబుతోంది .కనుక సూర్య గమనం అంటే కిరణప్రసారం అనుకొంటే ఇబ్బంది రాదు అన్నారు  శర్మ గారు .సూర్య కిరణప్రసారం అన్ని వైపులకు అన్నికాలాలలో జరుగుతు౦ది కనుక అది గమన శీలమే .’’సర్వే గత్యార్దాః బుద్ధ్యర్ధః ‘’అనే వ్యాకరణ సూత్రం ప్రకారం సూర్యుడు జ్ఞాన ,విజ్ఞాన మూర్తి .కనుకనే ఆయనను గురూత్తమునిగా వానరోత్తముడైన హనుమ భావించి నవ వ్యాకరణాలు అధ్యయనం చేశాడు .తరువాత ‘’సూర ‘’శబ్దం.’’సరతి గచ్చతి ఇతి సూరః ‘’అని లింగా భట్టు చెప్పాడు .దీనికీ ఇన శబ్దార్ధమే .శూర అని అనుకొ౦టే విక్రమించేవాడు అవుతాడు .సూర్య అంటే సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత అని అర్ధం .తరువాత ‘’ఆర్యమ ‘’అన్నా గమనం ఉన్నవాడనే అర్ధం –‘’ఋ గతౌ ‘’అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దం ఇది .కశ్యప ప్రజాపతి భార్య అదితి కి పుట్టాడు కనుక ఆదిత్యుడు .ఆమె దేవతలకు మాత .ధాతు చర్చలో ఆమె అఖండ బుద్ధి విశేషానికి ప్రతీక .గౌతమి పుత్ర శాతకర్ణి కి ముందే తల్లి పేరుతో చలామణి అయినవాడు ఆదిత్యుడు . ఇంద్ర ,ధాత ,పర్జన్య ,త్వష్ట ,పూష,ఆర్యమ ,భగ ,వివస్వత ,విష్ణు ,అంశుమంత ,వరుణ ,మిత్ర అనే 12 మూర్తులున్నవాడుకనుక ద్వాదశాత్ముడు .దివము అంటే పగలును చేసేవాడుకనుక దివాకరుడు .దిన భాగం లో ప్రాణులను చైతన్యం చేసేవాడనీ అర్ధం .’’భాసం కరోతి –ఇతి భాస్కరః ‘’అమేయమైన కా౦తినిచ్చేవాడు .ఆహస్సును చేసేవాడు ఆహస్కరుడు .నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు .ఆయన కాంతికి కొన్ని ప్రదేశాలలో అవరోధం కలుగుతుంది కనుక రాత్రి అవుతుంది .ఆ అడ్డంకి తొలగితే అహస్సు.  ‘’న జహాతి ప్రత్యాగమనమితి అహః ‘’అని లింగాభట్టు  విచిత్రమైన అర్ధం చెప్పాడు దీని అర్ధం తిరిగి రావటాన్ని విడువనిది .మరో అర్ధం –‘’సూర్యేణ న హీయతే ఇత్యహః ‘’అంటే సూర్యుడిని వదలి పెట్టి ఉండనిది .ఇలాంటి అహస్సును యేర్పరచేవాడు ఆహస్కరుడు .ఇతర తేజస్సులను అడ్డుకోనేవాడు ,చీకటిని కట్ట కట్టి దూరంగా విసిరేసేవాడు కనుక ‘’బ్రద్నుడు ‘’.బంధించే వాడని భావం .

ప్రభ ,విభ అనే ప్రశస్త అత్యధిక కాంతి నిచ్చేవాడు కనుక ప్రభాకరుడు ,విభాకరుడు .సర్వ ప్రాణి కోటికీ దర్శన సామర్ధ్యం కలిగించటాన్ని ప్రశస్తత అంటారు .కిరణాల ద్వారా అన్నాదులను ఏర్పాటు చేయటం విశిష్టత .ఇలాంటి ప్రయోజనాలు ,అనేక లోకాలకు అనంత వెలుగులు కలిగించేవాడు కనుక భాస్వంతుడు .కాంతి తో సర్వాన్నీ కప్పేస్తాడు కనుక వివస్వంతుడు .’’వస ‘’అనే ధాతువుకు ఆచ్ఛాదనం అని అర్ధం .ఏడు గుర్రాలపై వస్తాడుకనుక సప్తాశ్వుడు .వ్యాపించే గుణం ఉండటం వలన గుర్రానికి అశ్వం అని పేరు .ఈ వ్యాపన శీలం అగ్ని ,విద్యుత్తూ ,దీపం మనకు సూర్య ప్రతిరూపంగా దర్శనమిస్తుంది అంటారు శర్మ గారు .సూర్యుడికి ఒకే ఒక అశ్వం ఉందని దానిపేరే ‘’సప్త ‘’అనీ ‘’గురుబాల ప్రబోధిని ‘’తెలియ జేస్తోంది .అయితే లోకం లో 7 గుర్రాలు అని వాడుక .7 అనేవి 1 ఎలా అవుతుంది?న్యూటన్ వర్ణ చక్రం ను వేగంగా తిప్పితే 7 రంగులు కలిసి తెల్ల రంగు అవుతుందని మనకు తెలుసు .అసలు తెలుపు కూడా కాదు యే రంగూ లేని తనం .సూర్య రశ్మి లో 7 రంగులుంటాయి కదా అలా .హరిదశ్వ అనే పదానికి పచ్చ గుర్రాలున్నవాడు అని అర్ధం .సృష్టి లోని పచ్చదనానికి సూర్యుడు ప్రతీక .ఈ పచ్చదనం సంపద,సౌభాగ్యాలకు ప్రతీక .

సూర్యుడికి ‘’ఉష్ణ రశ్మి ‘’ అనే పేరుంది .కిరణాలు కలవాడని అర్ధం .సూర్యుడు విశ్వ దేహానికి అవసరమైన వేడిని తగిన ప్రమాణం లో కిరణాల ద్వారా అందిస్తూ విశ్వాన్నిరక్షిస్తాడు .ఈ ఉష్ణం ప్రాణికోటికి కావాల్సిన వాటిని పచనం పాకానికి తెచ్చి పోషిస్తాడు .’’వికర్తనుడు ‘’అంటే ‘’వికృతంతి తమః ‘’-చీకటిని చీల్చేవాడు ,’’వికృత కర్మణా విక్రుతః ‘’అనే మరో అర్ధం లో విశ్వ కర్మ సూర్యుడిని సానబెట్టి ప్రతాపాన్ని సహ్యంఅంటే సహి౦చేట్లు  చేశాడని  అర్ధం వస్తుంది .ప్రాణికోటికి ఈ రెండూ కావాల్సినవే .భౌతికమైన చీకటి సరే లోపల చీకటి కూడా ఉంది .అదే అజ్ఞానం .ఈ రెండిటినీ చీల్చి ప్రయోజనం కలిగిస్తాడు .’’అర్కుడు ‘’లోకాల చేత అర్చించ బడేవాడు .మృతండ మహర్షి కొడుకు కనుక మార్తాండుడు .మరో అర్ధం –‘’మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తా౦డః’’.మృతమైన బ్రహ్మాండాన్ని జీవింప జేస్తున్నాడు కనుక మార్తాండుడు .’’మిహిరుడు ‘’అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించే వాడు .సూర్య కిరణాలు జలరాశిని ఆవిరి చేసి మేఘాలుగా మార్చి వర్షాన్ని స్తాయి కనుక మార్తాండ ,మిహిర శబ్దాలు సూర్యునికి పర్యాయ పదాలను చేశారు మన మహర్షులు .

నిరంతర సంచారి కనుక అరుణుడు.ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు .అదే ‘’పూష’’.ఈ గమనం లో దివ్య జ్యోతులు కనిపిస్తాయికనుక ద్యుమణి .దీప్తి తుష్టి పుష్టి ఆరోగ్యాలను అందించే మణి.అందరికోసమే  ఆకాశం లో ఆయన అన౦త గమనం చేస్తాడు . ఆయన గమనం వలన ప్రాణులు చీకట్లను తరిస్తారు .ఆయన ఆకాశాన్ని తరిస్తాడు కనుక ‘’తరణి ‘’.సర్వ భూతరాశిపై స్నేహ భావం ఉండటం వలన ‘’మిత్రుడు ‘’..వివిధ  వర్ణాలున్నవాడుకనుక ‘’చిత్ర భానువు ‘’.సృష్టిలోని అన్ని రంగులు సూర్య కిరణ స్వరూపాలే .  విశేషంగా ప్రకాశించేవాడు కనుక ‘’విరోచనుడు ‘’ఆ కాంతి పు౦జ మే ఆయనకు ధనం అంటే వసువు అందుకే విభావసువు . ఆ ధనతత్వం ప్రాణుల ప్రయోజనం కోసమే కనుక దైవం అయ్యాడు .గ్రహాలకు నాయకుడుకనుక గ్రహ పతి .తన కిరణాలను ,ప్రతిరూపాలైన అగ్నులను ,ఓషధులను ,దేహం లోపలి జఠరాగ్నిమొదలైన వాటిని సంరక్షిస్తాడు కనుక ‘’త్విషాంపతి ‘’’’త్విట్టులుఅంటే కాంతులు అని అర్ధం .పగటికి ప్రభువుకనుక ఆహస్పతి.

‘’హంతి తమః ఇతి హంసః ‘’చీకట్లను రూపు మాపేవాడు కనుక హంస .అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్వుస్రాంశువు  ‘’.నిద్రించే వారిని మేల్కొల్పే వాడుకనుక ‘’సవిత ‘’-సువతి –సుప్తం ప్రేరయతి ‘’.ఇన్ని గొప్ప పనులు మనకోసం చేసేమహాత్ముడు కనుక ఆయన్ను స్తుతించాలి .స్తుతి అర్ధాన్నిచ్చే ‘’రు ‘’ధాతువు నుండి ఏర్పడినది ‘’రవి ‘’.లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక ‘’అంశుమాలి ‘’.మూడు వేదాలు అయన శరీరం గా ఏర్పడ్డాయి .వెలుగు అంటే విద్య కనుక .అవి ఆయన నుంచి వస్తున్నాయికనుక ‘త్రయీ తనువు’’.

14 లోకాలకూ వెలుగులివ్వ వలసిన వాడు కనుక ప్రకృస్టం గా ప్రకాశించాలి కనుక ‘’ప్రద్యోతనుడు ‘’.అందుకే దినమణి.ఆకాశం లో వెలిగేవాడుకనుక ‘’ఖద్యోతుడు ‘’.ఆపని లోక బాంధవ్యం కోసమేకనుక ‘’లోక బాంధవుడు ‘’.అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు ‘’.ధామం అంటే కాంతికి నిదికనుక ‘’ధామనిది ‘’.తామర పూలను వికసింప జేసేవాడు కనుక పద్మినీ వల్లభుడు .తమస్సు హరించేవాడు కనుక ‘’హరి ‘’.

ఇదీ ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్య నారా (నామా )యణం’.ఇంతటి అర్ధ భావాలను విశదీకరించిన శ్రీ శలాక వారు నిజంగా ‘’శబ్ద దినమణి’’ .ఆయన వెలుగే ఇదంతా .

మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.

మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |

తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ |

అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ |

జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ |

ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే

మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.

బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలవారూ, అన్ని వర్ణములవారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు.మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు.


‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ

ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ

స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

 .