Thursday, September 3, 2020

నరకలోకములు అనేవి ఉన్నాయా?

 DATE :-0/09/2020

ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు 

మనకి ప్రతి రోజు మన పూజ్య గురువు గారు శ్రీమద్ భాగవతం లో చాల చాల మంచి విశేషాలు మనం తెలుసుకోవలసిన విశేషాలు చెబుతున్నారు.. 

ఈ రోజు చెప్పిన ప్రవచనం కొంత ఆసక్తికరం గా ఉంది.. 

శుకదేవుడు చెప్పినవన్నీ విన్న మహారాజు పరీక్షిత్తు "మునీన్ద్రా!  లోకులు ఉచ్చనీచగతులు పొందుతారు అన్నావు.  ఈ వైచిత్ర్యమెందుకు కలుగుతుంది?  అసలు ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి.  నరకములనీ, స్వర్గములనీ వేరుగా ఎందుకు ఉన్నాయి?  భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు?" అని అడిగాడు.

ఈ విషయం గురించే మనకి గురువు గారు చాలా సవివరం గా చెప్పారు..

"సాత్వికులు, రాజసులు, తామసులు అని కర్మచేసేవాళ్ళు మూడు విధములుగా ఉంటారు.  వాళ్ళ శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉంటుంది.  సాత్విక శ్రద్ధతో కర్మ చేస్తే సుఖ ఫలం లభిస్తుంది.  రాజస శ్రద్ధతో చేస్తే దానిఫలం దుఃఖమయంగా ఉంటుంది.  పైగా అన్నీ సమయాల్లోనూ శ్రద్ధ ఒకే విధంగా ఉండదు.  శ్రద్ధల తారతమ్యం బట్టే కర్తల గతిలో తారతమ్యం వస్తుంది.  నిషిద్ధ కర్మ వల్ల అధర్మం కలుగుతుంది.  ఈ అధర్మ కర్మలు కూడా శ్రద్ధా భేదం వలన తారతమ్యం ఏర్పడి, దుఃఖ రూపమైన కర్మ ఫలంలో కూడా తారతమ్యము వస్తుంది.  ఆవిద్య వలన కోరికలతో చెడ్డ పనులు చేస్తారు మనుషులు.  అందుచేత వెయ్యివిధాల నరకాలు అనుభవిస్తారు.  అవన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను."  అని తెలియచేస్తారు.  


అప్పుడు మళ్ళీ మహారాజు "భగవంతుడా!  నరకలోకములు అనేవి ఉన్నాయా?  ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి?  అవి ఈ త్రిలోకములలో అంతర్భూతములా, లేక వాటి బయట ఉన్నాయా?  కొంచెం వివరించి చెప్పండి" అని అడిగాడు. 


ఆయన ప్రశ్నకు సమాధానంగా ఋషి చెప్తున్నాడు "అవును, ఈ మూడులోకములలోనే ఉంది ఆ నరకం అని పిలువబడే లోకం.  దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. (అండ జలాశయం మీద ఉంది).  

నీటికన్నా పైన భూమీ కన్నా కింద.  పాతాళ లోకం.. 

మనకి తరచుగా గురువు గారు మహా సంకల్పం చెప్తారు. అందులో వస్తుంది.. పాతాళ లోకం 

పూర్వం మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు  మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు.  లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది.  దక్షిణం వైపే అగ్నిష్వాత్తు మొదలైన పితృగణాల వారు తమ తమ గోత్రాల వారి మేలుకోరుతూ ఉంటారు.  (మరీచి పుత్రులు అగ్నిష్వాత్తు మొదలైన వారూ, విరాట్పుత్రులు సోమదత్తుడు మొదలైన వారూ, అత్రి పుత్రులు బహిర్షాదులు, తదితరులు పితృ గణాలు.  క్రమంగా వీరు దేవతలకూ, సాధ్వులకూ, దానవాదులకూ పితృగణాలు చెప్పబడతారు.)

సూర్యదేవుని పుత్రుడు యముడు పితృ రాజు.  ఆయన తన పరివారంతో నరక లోకంలో ఉంటాడు.  మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు.  పరమాత్మ ఆజ్ఞ మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు. 

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ, మరికొందరు అరవై ఒకటనీ అంటారు.  పేర్లూ, ఆకారములూ, లక్షణములను ఇప్పుడు వివరిస్తాను.  


"తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం." అని 21 నరకాలు.


అంటే తామస్రం, అంధతామస్రం, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందసం, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరిణి, పూయోదం, ప్రాణ రోధం, విశసనం, లాలాభక్షం, సారమేయోదనం, అవీచి, అయఃపానము - అనేవి 21 నరకాలు. 


ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి. అవి "క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం" - అంటే క్షారకర్థమం, రక్షాగణ భోజనం, శూలప్రోపం, దండశూకం, అవఠనిదోధనం, పర్యావర్తనం, సూచీముఖం.  ఇవి యాతనా భూములు.  ఇవి 7. 


మొత్తం ఇరవై ఎనిమిది (28) అవుతాయి.  ఇవన్నీ పాపులు రకరకాల యాతనలు అనుభవించే ప్రదేశాలు.


ఇట్లు 

శివ పరివారం 


రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుదనివాసినామ్, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్థతు అని ఒక శ్లోకం చెప్పారు.. మన భోజనానంతరం కొంత ఆహారం ను కొన్ని మెతుకునులు వదిలి వేసి ఇలా పద్యం చెప్పి కొంత ఉదకం ను ఒదిలివేయవలను.. కంచం లో ఉన్నది శాంతము నాకేయకుడదు.. ఆ ఉడక నీరే మన పితృదేవతలకు దాహం తీరుస్తుంది అని తెలియచేసారు..

No comments:

Post a Comment