Saturday, September 19, 2020

శ్రీమన్నారాయణ కవచము

వర నారాయణ కవచము

నరిభీకర వజ్రకవచ మాశ్రిత సంప

త్పరిణామ కర్మసువచము

పురుహూతున కెట్లు మౌని బోధించె? దగన్.


అనినం బరీక్షిజ్జనపాలునకు మునినాథుం డిట్లనియె.

"వినవయ్య! నరనాథ! మునినాథుఁ డింద్రున-

  కనువొంద నారాయణాఖ్య మైన

కవచంబు విజయ సంకల్పంబు నప్రమే-

  యస్వరూపంబు మహాఫలంబు

మంత్రగోప్యము హరిమాయావిశేషంబు-

  సాంగంబుగాఁగ నెఱుంగఁ జేసె;

దాని నే వినిపింతుఁ బూని తదేకాగ్ర-

  చిత్తంబుతోడుతఁ జిత్తగింపు;

మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు

ముఖముగా నుత్తమాసనమున వసించి

కృత నిజాంగ కరన్యాస మతిశయిల్ల

మహిత నారాయణాఖ్య వర్మము నొనర్చె.


ఇట్లు నారాయణకవచంబు ఘటియించి, పాదంబులను, జానువులను, నూరువులను, నుదరంబునను, హృదయంబునను, నురంబునను, ముఖంబునను, శిరంబునను నట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుచేసి ద్వాదశాక్షర విద్యచేతం గరన్యాసంబు చేసి, మంత్రమూఁర్తియై భగవచ్ఛబ్ద వాచ్యం బైన ప్రణవాది యకారాంత మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ పర్వసంధులయం దుపన్యసించి, మఱియు హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబు నందు, ణకారంబు శిఖ యందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వ సంధులయందు మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించె నేని మంత్రమూర్తి యగు; మఱియును "అస్త్రాయఫట్" అను మంత్రంబున దిగ్భంధనంబుచేసి, పరమేశ్వరునిం దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్చక్తి సంయుతం బైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠియించె.

గరుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ

ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో

త్కర నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం

భరిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్.


ప్రకట మకర వరుణ పాశంబు లందును

జలములందు నెందుఁ బొలియ కుండఁ

గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డై నట్టి

మత్స్యమూర్తి విద్యమానకీర్తి.


వటుఁడు సమాశ్రిత మాయా

నటుఁడు బలిప్రబల శోభనప్రతిఘటనో

ద్భటుడు త్రివిక్రమదేవుఁడు

చటులస్థలమందు నన్ను సంరక్షించున్.

అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం

దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం

హుఁడు సురశత్రుయూధప వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ

క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.

అరయఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో

నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా

కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో

హరుఁడు గృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁగావుతన్.

రాముఁడు రాజకులైక వి

రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ

స్తోముఁడు నను రక్షించును

శ్రీమహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.

తాటక మర్దించి తపసి జన్నముఁ గాచి-

  హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి

ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర-

  ఖరదూషణాది రాక్షసులఁ దునిమి

వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి-

  జలరాశి గర్వంబుఁ జక్కజేసి

సేతువు బంధించి చేరి రావణ కుంభ-

  కర్ణాది వీరులఁ గడిమిఁ ద్రుంచి

యల విభీషణు లంకకు నధిపుఁ జేసి

భూమిసుతఁ గూడి సాకేత పురము నందు

రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు

వరుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.

మఱియు; నఖిల ప్రమాదంబు లైన యభిచార కర్మంబుల వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబువలన యోగనాథుఁ డయిన దత్తాత్రేయుండును, గర్మబంధంబులవలన గణేశుం డైన కపిలుండును, గామదేవునివలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుటవలన శ్రీహయగ్రీవమూర్తి యును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబులవలన నారదుండును, నశేష నిరయంబులవలనఁ గూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుం డైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముం డయిన ఋషభుండును, జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబులవలన శేషుండును, నప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషాండ సమూహంబువలన బుద్ధదేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణపరుం డయిన మహావతారుండు నన్ను రక్షించుంగాత; ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నాపరాహ్ణ సాయంకాలంబులను ప్రదోషార్ధరాత్రాపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను గదాద్యాయుధంబుల ధరియించి, కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తు లను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుంగాక; ప్రళయకాలాన లాతితీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రం బైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు చేయు భంగి, భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము; జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటిసం స్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమనానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణకరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయవైరి దండోపదండంబుల భండనంబునం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక రక్షో భూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదంబు సలుపుము; ధరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణునిఁ నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్శ్వాసాధర వేణు పూరితంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మ త్పరవీరమండ లంబుల గుండియలతోఁ దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబయిన భూరి నాదంబున మోదింపు; మతి తీవ్రధారా దళిత నిశాతకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవయిన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు ఖండములుగ ఖడించి చెండాడుము; నిష్కళంక నిరాంతక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిరతం బవయిన చర్మంబ! దుర్మద మద్వైరిలోకంబులకు భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠుర తమః పటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము; నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు పొందకుండ భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల రక్షించుం గాక; బృహద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయం బడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుఁగాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణంబుల సంరక్షించు; భగవంతుండయిన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు; జగ దైక్యభావంబయిన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయ చేత ధరియించి తేజరిల్లు చుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁగాక; లోకభయంకరాట్టహాస భాసుర వదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుం డగు నప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబు వలన, సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుఁ గాత" మని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాస రూపంబున నింద్రుండు దెలిసికొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించెం; గావున నెవ్వరేని నిర్మలాత్ము లగు వార లే తద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన; నతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వ గ్రహ నిగ్రహ కర్మ మారణకర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి, యవ్యాకుల మనస్కులై, విజయంబు నొందుదురు; మఱియును, సర్వ రోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదు; రదియునుం గాక.

అతిభక్తిఁ గౌశికుం డను బ్రాహ్మణుఁడు దొల్లి-

  యీ విద్య ధరియించి యెలమి మించి

మరుభూమియందు నిర్మలచిత్తుఁడై యోగ-

  ధారణంబున బిట్టు తనువు విడిచె

దానిపై నొకఁడు గంధర్వవరేణ్యుండు-

  చిత్రరథాఖ్యుఁ డజేయుఁ డొంటి

చదలఁ జనంగఁ దచ్ఛాయ తదస్థిపైఁ-

  గదసిన నాతఁడు గళవళించి

యువిద పిండుతోడ నవ విమానముతోడఁ

దనదు విద్యతోడ ధరణిఁ ద్రెళ్ళి

తిరిగి లేవలేక తికమక గుడువంగ

వాలఖిల్యమౌని వానిఁ జూచి.

"నారాయణ కవచ సమా

ధారణ పుణ్యాస్థి దీని దగ్గఱ నీకుం

గూరెడినె? విష్ణుభక్తుల

వారక చేరంగ నెట్టివారికిఁ దరమే?

సంధించి నీ యంగక సంధులెల్లన్

బంధించి తన్మంత్రబలంబు పేర్మి

న్నందంబు మాన్పింపఁ దదన్యమేదీ?

సింధుప్రవాహోన్నతిచేతఁ దీరున్.

కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండ వై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు జేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన, నీ సర్వాంగబంధనంబు లుడుగు" ననిన నతం డట్ల చేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెఁ; గావున.

అనుదినము దీని నెవ్వరు

వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్

ఘన భూతజాల మెల్లను

మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్.

విశ్వరూపువలన నైశ్వర్యకరమైన

యిట్టి విద్యఁ దాల్చి యింద్రుఁ డపుడు

మూఁడులోకములకు ముఖ్యమైనట్టి శ్రీ

ననుభవించి మించె నధికమహిమ.


Wednesday, September 16, 2020

పితృదేవతల ఆరాధనం- మహాలయపక్షము

నం చేసే పని మీద నమ్మకం, భక్తి శ్రద్ధలు ఉండాలి. మనల్ని కనిపెంచిన, పెద్ద చేసిన పితరుల పట్ల గౌరవం, పూజ్య భావం ఉండాలి. ఇది మన కనీస బాధ్యత. మనల్ని చూసి మన సంతానం నేర్చుకోవలసి సంప్రదాయం ఇది. మనకు ఋషులు కల్పించిన మహదవకాశం ‘మహాలయం’.
 
పితృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే ‘మహాలయం’గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం’ అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని ‘మహాలయ పక్షం’ అని చెబుతారు.
 
‘‘అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః
వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి, సూర్యాస్తమయం వరకూ ఉండి, తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది, ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది, శాపనార్ధాలతో నిందించి, తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.
 
నిజమే మరి! బిడ్డకు జన్మనిచ్చిన తల్లితండ్రులు... కోటి ఆశలతో పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్ధుల ద్వారా ఒక స్థాయికి తెచ్చిన వారు... తమ చరమ దశలో ఆదుకుంటాడని ఆశించడం అసహజం కాదు. అలాకాక, మరోలా ప్రవర్తిస్తే ఏమనాలి? ఊపిరి ఆగిన తరువాత తమకు జన్మనిచ్చిన వారి అంత్యేష్ఠిని భక్త శ్రద్ధలతో నిర్వహించి, కర్మకాండ జరిపించడం పితృఋణం తీర్చినట్టు కాదు.
 
మూడు ఋణాలు
ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘యజ్ఞేవ దేవేభ్యః’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘బ్రహ్మచర్యేణ ఋషిభ్యః’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి.
ఇక మూడవది పితృ ఋణం. ‘ప్రజయా పితృభ్యః’ అని శాస్త్రవచనం. సంతానంతో పితృ ఋణం తీరుతుంది. ఇది పరంపరానుగతమైనది. దీనికి విఘాతం కలిగించకూడదు. తగిన వయసులో వివాహం చేసుకొని, సంతానాన్ని పొందాలి. తద్వారా పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించాలి. మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు- తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు. గరుడ పురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.
 
పితృ యజ్ఞం
మహాభారతంలో, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పితృ యజ్ఞాన్ని గురించి ధర్మరాజు కోరిక మేరకు వివరంగా చెప్పాడు. ‘‘దైవ పూజ కన్నా పితృ పూజే గొప్పది. పితృ దేవతలతో పాటు దేవగణాలూ సంతృప్తి చెందుతాయి. పితృ సమారాధనం సర్వ శుభసాధనం. ప్రతి అమావాస్య నాడు భక్తితో పితృ యజ్ఞం నిర్వహించాలి. అలా చేస్తే సంవత్సరమంతా పితృయజ్ఞం నిర్వహించిన ఫలం ప్రాప్తిస్తుంది’’ అని తెలిపాడు. సాధారణంగా ప్రతి అమావాస్య నాడు లేదా పితరులు మరణించిన రోజున శ్రాద్ధ కర్మలను మన పితృ దేవతలకు మాత్రమే పరిమితం చేస్తాం. కానీ, పితృ పక్షాలలోనూ, మహాలయ అమావాస్య నాడు సామూహిక శ్రాద్ధాలు... అంటే మన వంశంలోని పితృ దేవతలకూ, చనిపోయిన బంధు మిత్రులకూ, ఎంతమందికి వీలయితే అంతమందికి పిండ తర్పణాది కార్యక్రమం నిర్వహించవచ్చు. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ పక్షం. ఆ అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అని పేర్కొంటారు. ఈ పేరు వెనుక ఒక కథ మహా భారతంలో ఉంది.
 
కర్ణుడి నుంచి మొదలు!
కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన కర్ణుని జీవాత్మ స్వర్గ మార్గంలో ప్రయాణం సాగించింది. కర్ణుడు బ్రతికున్న కాలంలో అర్థించిన వారందరికీ లేదనకుండా దానం చేసి, దానకర్ణుడుగా కీర్తి గడించాడు. అలాంటి కర్ణుడికి మార్గమధ్యలో ఆకలిదప్పులు కలిగాయి. చెట్టుకు పండిన పండును కోసుకు తిందామంటే, అది బంగారంగా మారింది! జలం తాగి ఆకలి తీర్చుకుందామంటే దోసిలిలో నీరు బంగారమయింది! కర్ణుడికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి అయిన సూర్యుణ్ణి ప్రార్థించాడు. ప్రత్యక్షమైన సూర్యుడికి తన గోడు చెప్పుకొని, పరిష్కారం అడిగాడు.
 
అప్పుడు సూర్యుడు ‘‘నాయనా! నువ్వు దానకర్ణుడివే! అనుమానం లేదు. నీ సంపదనంతా దానం చేశావు. ఇంద్రుడు కోరితే సహజ కవచ కుండలాలనే దానం చేశావు. కానీ, ఒక్క రోజైనా, ఒక్కరికైనా అన్నదానం చేయలేదు. దాని ప్రభావమే ఇది!’’ అని చెప్పాడు. పరమాత్మ అనుమతితో కర్ణుడిని సశరీరంగా భూలోకానికి పంపిస్తూ, అన్నదానం చేయాల్సిందిగా సూచించాడు. కర్ణుడు సశరీరునిగా భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద కృష్ణ పాడ్యమి. నాటి నుంచి పదిహేను (పక్షం) రోజులపాటు ఆకలి గొన్నవారికి అన్నదానాలు జరిపాడు. బంధు మిత్రులకు శాద్ధ కర్మలూ, తర్పణాదులూ నిర్వహించి, తిరిగి స్వర్గానికి పయనమయ్యాడు.
 
నాటి నుంచి భాద్రపద మాస శుక్ల పక్షం దైవ కార్యాలకూ, కృష్ణ పక్షం పితృ యజ్ఞాలకూ పరిమితం అయ్యాయి. కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షం రోజులూ పితృ యజ్ఞం నిర్వహించాలనీ, వీలుకాని పక్షంలో అమావాస్య నాడు నిర్వహించాలనీ స్కాంద పురాణం చెబుతోంది. మన తాత ముత్తాతలు తృప్తి చెందితే... వారి అనుగ్రహం వల్ల మన తరువాతి తరాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రబలమైన ధార్మిక విశ్వాసం. ఆ కారణంగానే పితృ కార్యాలకు మన శాస్త్రాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయి. శుభకార్యాలైన ఉపనయ, వివాహ సందర్భాల్లో కూడా పితరుల పట్ల శ్రద్ధా భక్తులు ప్రకటించే ఘట్టాలు చేటు చేసుకుంటాయని గమనించాలి.
 
భాద్రపదమాస కృష్ణ పక్షం మహాలయ పక్షం. ఈ రోజుల్లో శాస్త్ర విధిని అనుసరించి పితృ దేవతలను తృప్తి పరచాలి. పితరుల తృప్తి కోసం ఈ పుణ్య క్రతువును యాచన చేసి అయినా నిర్వర్తించాలనీ, అది ధర్మ సమ్మతమేననీ శాస్త్రం చెబుతోంది. ‘‘ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి శ్రాద్ధ కర్మలు విధిగా ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసిన ఫలం కన్నా పితృ దేవతలకు తర్పణాలు విడవడం వల్ల లభించే ఫలం ఎంతో ఎక్కువ’’ అని ఏనాడో మన మహర్షులు చెప్పారు.

 మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు. ఋణ త్రయాలు -1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము.

1 ఋషి ఋణము: ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.
2. దేవ ఋణము: దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.
3. పితృ ఋణం: మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.
పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.
ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.
ఇంతమంది మహానుభావులైన పితృ దేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభంనుంచి ఆమావాస్య వరకు ఆతర్వత ఆశ్వీజ, కార్తీక కృష్ణ పక్షాలలోను ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాసించును. ‘యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్’ అని వాక్యం. మహతామ్+ ఆలయం=మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును. దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు.
ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది. ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓకరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.
భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే వుండి పోతారు. అప్పటికి కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ, తర్పణాలు చెయ్యకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరు తిరిగి పితృ లోకాలకు వెళ్లిపోతారు. వారు నిరాశ చెందితే మనకు వారి ఆశీస్సులెలా అందుతాయి?
కావున మహాలయ పక్షాలలో మన వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంకగా ‘కారుణ్యపితరులు’గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం జరుగుతుంది. కావున పితరులను నిరాశపరచకుండా కార్తీకం వరకు సమయముంది కదా అని తాత్సారం చేయకుండా భాద్రపద మాసంలోనే మహాలయపక్షంలోనే మహాలయ శ్రాద్ధ తర్పణాలు అవశ్యం చేసి తీరాలనే పెద్దల ఆదేశాన్ని పాటించడం మన విధి.
1 తర్పణాలు ఎప్పుడాచరించాలి?: దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.
2. ఎవరు తర్పణం చేయాలి?: 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. 3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి.
3. తర్పణం ఎవరెవరికి చేయాలి?: 1. ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారి నాహ్వానించి) తర్పణం చేయాలి. 2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.
వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు
పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి.
పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.
మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు. మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.
మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.
మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభానే్న వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకం భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడంవలన మనం పొందవచ్చును.
ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.
భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధంగానైనా మనం మన పిల్లలు-తండ్రి, తాత, ముత్తాత ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.
అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తి పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది. మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారాశించేదేమిటి? కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఇది ధర్మంలుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.
తర్పణం చేయకుంటే ఏమవుతుంది?: తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి చిన్న సహాయంచేసిన వాడికి ధాంక్సు అంటూ కరిగిపోతూ చెబుతామే! మరి మన శరీర సృష్టికే కారణమైన, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధం! ఎంత మూర్ఖం! కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం!
అన్ని అమావాస్య-సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా?: వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి.సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతు చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ ఎదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.
కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా?: ‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా!ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే కదా! ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే మన పితృదేవతలను మనం మరిచిపోవడమే కదా! మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.
తర్పణము చేయుటకు అశక్తులు-అనర్హులకు ఏమిటి పరిష్కారం?: ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం-ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే (వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు) ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లేవనేది ప్రత్యక్ష సత్యం.


Thursday, September 3, 2020

నరకలోకములు అనేవి ఉన్నాయా?

 DATE :-0/09/2020

ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు 

మనకి ప్రతి రోజు మన పూజ్య గురువు గారు శ్రీమద్ భాగవతం లో చాల చాల మంచి విశేషాలు మనం తెలుసుకోవలసిన విశేషాలు చెబుతున్నారు.. 

ఈ రోజు చెప్పిన ప్రవచనం కొంత ఆసక్తికరం గా ఉంది.. 

శుకదేవుడు చెప్పినవన్నీ విన్న మహారాజు పరీక్షిత్తు "మునీన్ద్రా!  లోకులు ఉచ్చనీచగతులు పొందుతారు అన్నావు.  ఈ వైచిత్ర్యమెందుకు కలుగుతుంది?  అసలు ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి.  నరకములనీ, స్వర్గములనీ వేరుగా ఎందుకు ఉన్నాయి?  భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు?" అని అడిగాడు.

ఈ విషయం గురించే మనకి గురువు గారు చాలా సవివరం గా చెప్పారు..

"సాత్వికులు, రాజసులు, తామసులు అని కర్మచేసేవాళ్ళు మూడు విధములుగా ఉంటారు.  వాళ్ళ శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉంటుంది.  సాత్విక శ్రద్ధతో కర్మ చేస్తే సుఖ ఫలం లభిస్తుంది.  రాజస శ్రద్ధతో చేస్తే దానిఫలం దుఃఖమయంగా ఉంటుంది.  పైగా అన్నీ సమయాల్లోనూ శ్రద్ధ ఒకే విధంగా ఉండదు.  శ్రద్ధల తారతమ్యం బట్టే కర్తల గతిలో తారతమ్యం వస్తుంది.  నిషిద్ధ కర్మ వల్ల అధర్మం కలుగుతుంది.  ఈ అధర్మ కర్మలు కూడా శ్రద్ధా భేదం వలన తారతమ్యం ఏర్పడి, దుఃఖ రూపమైన కర్మ ఫలంలో కూడా తారతమ్యము వస్తుంది.  ఆవిద్య వలన కోరికలతో చెడ్డ పనులు చేస్తారు మనుషులు.  అందుచేత వెయ్యివిధాల నరకాలు అనుభవిస్తారు.  అవన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను."  అని తెలియచేస్తారు.  


అప్పుడు మళ్ళీ మహారాజు "భగవంతుడా!  నరకలోకములు అనేవి ఉన్నాయా?  ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి?  అవి ఈ త్రిలోకములలో అంతర్భూతములా, లేక వాటి బయట ఉన్నాయా?  కొంచెం వివరించి చెప్పండి" అని అడిగాడు. 


ఆయన ప్రశ్నకు సమాధానంగా ఋషి చెప్తున్నాడు "అవును, ఈ మూడులోకములలోనే ఉంది ఆ నరకం అని పిలువబడే లోకం.  దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. (అండ జలాశయం మీద ఉంది).  

నీటికన్నా పైన భూమీ కన్నా కింద.  పాతాళ లోకం.. 

మనకి తరచుగా గురువు గారు మహా సంకల్పం చెప్తారు. అందులో వస్తుంది.. పాతాళ లోకం 

పూర్వం మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు  మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు.  లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది.  దక్షిణం వైపే అగ్నిష్వాత్తు మొదలైన పితృగణాల వారు తమ తమ గోత్రాల వారి మేలుకోరుతూ ఉంటారు.  (మరీచి పుత్రులు అగ్నిష్వాత్తు మొదలైన వారూ, విరాట్పుత్రులు సోమదత్తుడు మొదలైన వారూ, అత్రి పుత్రులు బహిర్షాదులు, తదితరులు పితృ గణాలు.  క్రమంగా వీరు దేవతలకూ, సాధ్వులకూ, దానవాదులకూ పితృగణాలు చెప్పబడతారు.)

సూర్యదేవుని పుత్రుడు యముడు పితృ రాజు.  ఆయన తన పరివారంతో నరక లోకంలో ఉంటాడు.  మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు.  పరమాత్మ ఆజ్ఞ మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు. 

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ, మరికొందరు అరవై ఒకటనీ అంటారు.  పేర్లూ, ఆకారములూ, లక్షణములను ఇప్పుడు వివరిస్తాను.  


"తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం." అని 21 నరకాలు.


అంటే తామస్రం, అంధతామస్రం, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందసం, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరిణి, పూయోదం, ప్రాణ రోధం, విశసనం, లాలాభక్షం, సారమేయోదనం, అవీచి, అయఃపానము - అనేవి 21 నరకాలు. 


ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి. అవి "క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం" - అంటే క్షారకర్థమం, రక్షాగణ భోజనం, శూలప్రోపం, దండశూకం, అవఠనిదోధనం, పర్యావర్తనం, సూచీముఖం.  ఇవి యాతనా భూములు.  ఇవి 7. 


మొత్తం ఇరవై ఎనిమిది (28) అవుతాయి.  ఇవన్నీ పాపులు రకరకాల యాతనలు అనుభవించే ప్రదేశాలు.


ఇట్లు 

శివ పరివారం 


రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుదనివాసినామ్, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్థతు అని ఒక శ్లోకం చెప్పారు.. మన భోజనానంతరం కొంత ఆహారం ను కొన్ని మెతుకునులు వదిలి వేసి ఇలా పద్యం చెప్పి కొంత ఉదకం ను ఒదిలివేయవలను.. కంచం లో ఉన్నది శాంతము నాకేయకుడదు.. ఆ ఉడక నీరే మన పితృదేవతలకు దాహం తీరుస్తుంది అని తెలియచేసారు..