Thursday, June 19, 2025

ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు

ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు 
"ఒకప్పుడు పోస్ట్‌మ్యాన్‌ను చూస్తే బంధువును చూసినట్టే ఉండేది
ఉత్తరం చదువుతుంది మమకారంతో మాట్లాడుతుంది అనుభూతి కలిగేది
ఈ రోజుల్లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నా.. ఆ అప్యాయత కనిపించడం లేదు!"
ఈనాటి తరానికి దూరమైన ఉత్తరాలు... ఒకప్పుడు మా తరం వరకు ఇవి అందరికీ పరిచయమైనవే. మా ఇంట్లో నాకు ఉత్తరాలు వ్రాసే అలవాటు బాగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నాన్నగారు అమ్మ  భీమవరం లో  ఉండేవారు. మేము హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో, ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ సవివరంగా వ్రాసేవాడిని. ఇంచుమించు మూడు నాలుగు పేజీలు ఉండేవి. నాన్నగారికి నా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని అమ్మ చెప్పేది. నాన్నగారు తీరిగ్గా భోజనం చేసి, అమ్మ పనులు ముగించుకున్నాక, ఇద్దరూ కలసి ఆ ఉత్తరాన్ని చదివేవారు. నాన్నగారు ఆలా ఊ కొట్టుతూ వింటూ ఉండేవారు. నా ఉత్తరం చదవడం అయ్యాక, అమ్మ – "ఇదండీ విశేషాలు, చిన్నాడివి వ్రాసినవి" అనేది.

రెండు రోజులకు ఒకసారి నాన్నగారు అడిగేవారు – "చిన్నాడు ఉత్తరం వ్రాశాడా?" అని. కనీసం పోస్ట్‌కార్డు, కవర్‌, ఇన్లాండ్ లెటర్‌,  పంపే వాడిని. నా దగ్గర ఎప్పుడూ స్టాంపులు స్టాక్‌లో ఉండేవి. కొత్త స్టాంపులు వస్తే కోనేసేవాడిని . పోస్ట్ ఆఫీస్ కి నాకు చాల అవినాభావ సంభందం ఉండేది అప్పట్లో ... 

నేను చాలా కాలం మా తాతగారు, తాతనాన్న వ్రాసిన ఉత్తరాలు దాచుకున్నాను. వాళ్ల దస్తూరి (చెరసి, రాత) చాలా శుభ్రంగా, చక్కగా ఉండేది.

అలాగే మా చిన్నతనం లో "మా మావయ్య (ఓరుగంటి వేణు గోపాలకృష్ణ) అప్పట్లో అమెరికా, జర్మనీలో ఉండేవారు. మా మావయ్య కూడా అక్కడి విశేషాలు, అనుభవాలు అన్నీ సమగ్రంగా ఉత్తరాల్లో వ్రాసి పంపేవారు. ఆ ఉత్తరాలు మేము మళ్ళీ మళ్ళీ చదువుతుండేవాళ్లం. మావయ్య ఉత్తరాల్లో అమెరికా విశేషాలు, తాను ఎక్కడెక్కడికైనా వెళ్లారో వివరంగా వ్రాసేవారు. ఆ వివరాలను మేమూ చదివి, మేమూ అక్కడికి వెళ్లినట్టే ఫీలయ్యేవాళ్లం. ఆ విశేషాలు మా స్నేహితులకు కూడా ఉత్సాహంగా చెప్పుకునే వాళ్లం. తర్వాత మావయ్య అక్కడ తీయించిన ఫోటోలు పంపేవారు. ఆ ఫోటోల వెనుక చిన్న కాగితం అతికించి, ఆ ప్రదేశం గురించి, దాని విశిష్టత గురించి వివరంగా వ్రాసేవారు."
ఇప్పుడు తపాలా..తప్పయిపోయింది మన్నించు..ఎన్ని సంవత్సరాల అనుబంధం , తర తరాలు  గా పెంచుకున్నాం..పంచుకున్నాం.. ఇప్పుడు తుంచుకున్నాం..! తుంచేశాము కూడా 
ఊహ తెలిసిన కొత్తలో వీధి చివర పోస్టు డబ్బా ఇదేంటబ్బా..అదో జిజ్ఞాస ఇంటికి పోస్ట్ మాన్ వస్తే చుట్టమొచ్చినంత సంబరం 
కవర్ అందుకుని అమ్మకో నాన్నకో ఇచ్చాక కొస చింపుతుంటే అదో ధ్రిల్..
సినిమాల్లో గుమ్మడో, ఏయెన్నారో ఉత్తరం చదువుతున్నప్పుడు  సావిత్రి కనిపించినట్టు ఉండేది 
అమ్మ చేతి  లేఖలో అమ్మమ్మ.. నాన్న చదివే లెటర్లో బాబాయ్  కనిపిస్తారేమోనని భ్రమ..అప్పుడప్పుడు 
పోస్ట్ మాన్ డబ్బిస్తే  అదో ప్రశ్న..ఎందుకు ఇస్తున్నారు అని..!? మా నాన్నమ్మ మనీ ఆర్డర్ కోసం అప్పట్లో ఎదురు చూపులు 
ఎన్ని కబుర్లు..ఎన్నెన్ని విశేషాలు..సంగతులు..సమాచారాలు..కుశలాలు..కౌసలాలు..
వందల కిలోమీటర్ల  దూరంలో చదువుకుంటున్న  బాబాయ్ డబ్బులు పంపండి అంటూ కొన్ని ఉత్తరాలు 
తాతకు వేదన అప్పు కోసం యాతన.. అని మరికొన్ని .. చాలా ప్రశ్నలకు  ఒకటే ... జవాబు
అలాంటి ఉత్తరం లు ఇప్పుడు ఇంచుమించు అదృశ్యం.. అలా కాకపోయినా  అరుదైన దృశ్యం..
ఎన్నో తరాలకు ఉత్తరకాండ. ప్రస్తుతం దాని బ్రతుకే అరణ్యకాండ..!
ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక  ఉత్తరాలు..ప్రత్యుత్తరాలు..అన్ని ఒక పరంపర లోనే 
అన్నిటికీ ఫోనే గతి.. ఆ క్రమంలో  ఉత్తరానికి హారతి..
ఎర్ర డబ్బా.. ఇప్పుడెక్కడబ్బా.. ఎగిరిపోయిందా ... 

ఇట్లు 
శర్మ రాణీ

Sunday, March 23, 2025

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు. ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు. ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.

 
శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!     1
సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!         2
ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!     3
ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.
నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే
గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!         4
ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.
భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁ గూలంగఁ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!     5
జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.
స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్‌ బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?
యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా!     6
ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)
దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా!     7
కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?
నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్
బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్‌; చీకాకు నా భక్తి, యే
రీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా!     8
అర్జునునిలాగా నీతో యుద్ధము చేయలేను. కవిత్వము చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలే తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలే నిన్ను రోకలితో మొత్తలేను. నా భక్తి, నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది?
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక నిన్నేవేళఁ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి, యీ
శీలామాలపుఁ జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!         9
ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనే పాశములను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను నేనెట్లా స్మరించగలను? ఈ భరింపరాని దుఃఖము ఎలా పోగొడతావో శంకరా! నీ దయ.
నిప్పై పాతకతూలశైల మడచున్ నీనామము న్మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్‌ మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా!     10
శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు, పండితులు చెప్తుంటే, ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు? నీ పేరును స్మరించుటకు సిద్ధపడరెందుకు?
వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగుదంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!         11
ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు, అనగా భోగములు కలిగినప్పుడు, తమను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్యవైభవములు బాగా ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు తమ గొప్పతనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేస్తూ విర్రవీగు వారిని ఏమనాలో తెలియదు.
నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!     12
ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహాచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు అన్నీ నీ అనుగ్రహములు గానే కనిపిస్తాయి.

Sunday, February 23, 2025

భళా కుంభమేళా ఇది ఒక మహా యజ్ఞం..



*_భళా కుంభమేళా.._*
*ప్రదర్శనం కాదది నిదర్శనం*
ఒక మహా యజ్ఞం..
గొప్ప క్రతువు..
ఇలలో జరుగుతున్న అద్భుతం..
కలియుగంలో దేవుని ఉనికిని  
చాటుతూ సాగుతున్న
అత్యద్భుత ఆధ్యాత్మికయాగం..
కోట్లాది మంది ఒకటిగా
జరుపుకుంటున్న 
దైవ కార్యక్రమం..
నభూతో నభవిష్యతి..
*_కుంభమేళా.._*
*_మహాకుంబ మహాకుంభ మహా కుంబ్.!_*

నలభై అయిదు రోజులు..
*_ప్రయాగరాజ్..హరిద్వార్.._*
*_ఉజ్జయిని..నాసిక్.._*
నాలుగు వేదికలు..
నలభై కోట్ల జనం..
ప్రభంజనం..
_అతి పెద్ద పండగ.._
_భరతజాతి వేడుక.._
_ఇంటింటి సంబరం.._
మనిషి.. సాటి మనిషి
కలిసి ఆచరిస్తున్న
మానవతా మహాకార్యం..
*_అందరూ ఒకటై తరిస్తున్న_*
*_కలియుగ మహాద్భుతం..!_*

మనుషులు పోయారు..
నిజమే..అత్యంత బాధాకరమే..
అయితే ఇలాంటి 
గొప్ప సందర్భంలో..
ఒక గొప్ప దీక్షలో..
మహావేడుకలో..
దివ్య ముహూర్తంలో
అసువులు బాయడమంటే
స్వర్గలోక ప్రాప్తికి..
కైలాస యాత్రకి..
సాక్షాత్ మహాదేవుని
సన్నిధికి చేరడానికి
ఇంతకు మించిన సందర్భం ఇంకేముంటుంది..
అది అపశ్రుతే అవనీ..
బంధువులకు బాధ కలిగించనీ..
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే..
కైవల్య ప్రాప్తికీ.. 
జన్మ రాహిత్యానికి 
ఇంతకంటే
దగ్గర దారి ఇంకొకటి ఉంటుందా..!?.

సరిగ్గా..ముప్పై ఆరు 
రోజుల క్రితం..
పుష్యమాసం..
పౌర్ణమి పుణ్యతిధి నాడు వెలిగింది మొదటి దీపం...
జరిగింది తొలి మునక..
పొంగింది ప్రతి భారతీయుని హృదయం..
ఉప్పొంగింది గంగా ప్రవాహం..
*_జలం జాలమై.._*
*_పురివిప్పిన జటాఝూటమై.._*
*_జనం జాగరణమై.._*
ఆకాశం చుక్కల పందిరై..
తారా తోరణమై..
భక్త హృదయం పరవశమై..
ప్రతి మది 
*_పరమశివుని వశమై..!_*

ఈ నెల 26..
మహాశివరాత్రి నాడు..
జనమంతా జాగరణకు
సిద్ధమవుతున్న వేళ..
జగమెల్ల హర నామ స్మరణంతో
పరవశించే ముహూర్తాన
అక్కడ..ఆ నాలుగు
దివ్య క్షేత్రాలలో కుంభమేళా ముగింపు..మరింతగా ఒడల
జలదరింపు..ఇంకా ఉంటే బాగున్నే అనిపించినా..
ఎంతటి వేడుకకైనా
కాలమానమే కొలమానం..!

ప్రస్తుతం జరుగుతున్న 
మహాకుంభమేళాతో 
పన్నెండు కుంభమేళా 
చక్రాల పూర్తి..
అఖండ స్ఫూర్తి..
కొలువై దగ్గరుండి నిర్వహించిన
మహాశివుని మూర్తి..
కలియుగ మహాద్భుత
ఘట్టం..భరత జాతి కీర్తి..!

ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసమ్మేళనం..ఆనాడు జరిగిన మహాసమ్మేళనంలో
పాల్గొన్న సన్యాసులు..
సాధువులు..రుషులు..
మహామునులు..అఘోరాలలో
కొందరు ఇప్పటికీ జీవించి ఉండి వర్తమాన మహాకుంభమేళాకు కూడా హాజరయ్యారా..అన్నట్టు
ఎంతమంది వృద్ధులు..
ఎక్కడెక్కడి నుంచి వచ్చారో..
మామూలు సమయాల్లో 
బయటి ప్రపంచం చూడని..
ఆ బయట ప్రపంచానికి కనిపించని యోగులు..
కుంభమేళాలో ప్రత్యక్షమై
ఆ మహా వేడుకకు
పరిపూర్ణత చేకూర్చారు.

అసలు ఏం తిన్నారో..
ఎక్కడ ఉన్నారో..
ఎప్పుడు పడుకున్నారో..
ఎవరికీ అవగాహన కలగని
రీతిలో నాలుగు క్షేత్రాల్లో 
రేయనక పగలనక 
సంచరించి వేడుకకు సాధుసత్సంగపరిషత్
కళను తెచ్చి పెట్టారు.. దివి నుంచి దేవతలే ఆ రూపంలో వచ్చి అక్కడ తిరుగాడుతూ
ఉత్సవం ఇంత మహోన్నతంగా జరిగేలా అన్నీ దగ్గరుండి పర్యవేక్షించినట్టు కనిపించింది.

కుంభమేళాకు పురాణాల కాలం నాటి నుంచి మూలాలున్నాయి.
దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించిన సమయంలో అమృతం చుక్కలు నాలుగు ప్రయాగరాజ్..హరిద్వార్..
ఉజ్జయిని..నాసిక్ లలో పడ్డాయని ప్రశస్తి.

త్రివేణి సంగమంలో మునక
కుంభమేళాలో అత్యంత కీలక..పవిత్ర..పరాకాష్ఠ ఘట్టం.
ఈ సమయంలో ఇక్కడ చేసే పవిత్ర స్నానం వల్ల సకల 
పాప హరణం..మోక్ష సిద్ధి ఒనగూరుతాయని ప్రతీతి.

మహాకుంభమేళా జరిగే సమయాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణయిస్తారు.
బృహస్పతి కుంభంలోకి
ప్రవేశించే తరుణంలో
సూర్యుడు మకరరాశిలోకి
చేరే ముహూర్తాన కుంభమేళాకు అంకురార్పణ జరుగుతుంది.

సరే..ఏదిఏమైనా 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రపంచ అత్యద్భుత వేడుకకు 
పూర్వజన్మ సుకృత ఫలితంగా
మనం సాక్షీభూతులుగా నిలిచాం.

అవకాశం ఉండి మేళాకు వెళ్ళి మునకలు వేసిన వారు ధన్యులు..

లేకపోయినా టివిల్లో చూసి..
పేపర్లలో చదివి..
ఏదో ఒక మాధ్యమం ద్వారా విశేషాలు తెలుసుకున్న వారు సైతం అదృష్టవంతులు..

ఇవేవీ అనుభూతించని
మారుమూల ప్రాంతవాసులు..
నిరక్షరాస్యులు.. ఆపాటి జ్ఞానం లేని వారు కూడా 
ఈ మహాక్రతువు జరిగిన పుణ్యభూమిపై 
ఈ సమయంలో జీవించి ఉండి
పరమపదానికి బాటలు వేసుకున్నట్టే..

చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా..
చేసుకోని వారికి కూడా
సమాన పుణ్యం..పురుషార్ధం లభించే అత్యద్భుత విశేషం
ఈ కుంభమేళా..

ఈ పవిత్ర భూమిలో పుట్టడమే ఒక అదృష్టం..
ఇక్కడ జన్మించిన 
ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప వేడుకలో జన్మానికి 
ఒక శివరాత్రి అన్నట్టు 
పాల్గొన్న వారే..
యజ్ఞాలు..యాగాలు..
క్రతువులు..నిత్య పూజలు..
పండగలు..తిరనాళ్ళు..
జాతరలు..అమ్మవారి ఉత్సవాలు..బోనాలు..
బ్రహ్మోత్సవాలు..
పరాకాష్టగా పుష్కరాలు..
కుంభమేళాలు..ఇంకా ఇంకా
ఉత్కృష్టంగా ఇప్పుడు జరుగుతున్న 
*_మహా కుంభమేళా..!_*

*_కుంభమేళా.._*
భువిలో మనుజులు..
దివి నుండి దేవతలు..
కలిసి చేసుకుంటున్న
అతి పెద్ద..అరుదైన..
మహాద్భుతమైన..
*_విశ్వవేడుక.._*
అందుకు ప్రయాగ..
హరిద్వార్..
ఉజ్జయిని..
నాసిక్..
ఈ నాలుగు క్షేత్రాల
సంగమం..
*_విశ్వవేదిక..._*
ఇలాంటి మహోత్సవాలు
హిందూ సంస్కృతిలో
గొప్ప *_పారంపర్య వాడుక..!_*

ఈ మహోత్సవం రేపు 
26 న ముగిసేది కాదు..
ఇదొక నిరంతర ప్రక్రియ..
హిందూ ధర్మ పరిరక్షణ
కొనసాగింపు..
మానవధర్మ ఆకళింపు..
ఆధ్యాత్మికతకు కలియుగంలో
సరికొత్త రూపు..
భక్తిసాగర మధింపు..
చివరగా..ఏ యుగంలో జరిగినా ఆధ్యాత్మికతకు
పరిపూర్ణ గెలుపు..
ప్రతి యుగంలోనూ
ఒక మలుపు..
మేలుకొలుపు..!